సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్త వెంగళరావుకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరైంది. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెంగళరావును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ కస్టడీలో భాగంగా వెంగళరావుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు నిందితుడు మేజిస్ట్రేట్ఆ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో నిందితుడికి వైద్య పరీక్షలు చేయాలంటూ న్యాయమూర్తి పంపించిన సంగతి విదితమే.కోర్టు ఆదేశాలతో గుంటూరు జీజీహెచ్లో వెంగళరావుకు వైద్య పరీక్షలు నిర్వహించిన సీఐడీ అధికారులు… మధ్యాహ్నం ఆయనను తిరిగి సీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వెంగళరావు రిమాండ్ కు సంబంధించి సీఐడీ అధికారులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. 41 సీఆర్పీసీ కింద నిందితుడికి నోటీసులే ఇవ్వలేదని చెప్పిన న్యాయమూర్తి… నిబంధనలకు విరుద్ధంగా జరిగే అరెస్టుల్లో రిమాండ్ రిపోర్టును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వెంగళరావుకు వ్యక్తిగత పూచీకత్తుతోనే బెయిల్ మంజూరు చేశారు.