హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు
ఇటీవలే అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్లి తిరిగి వచ్చిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తాజాగా గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో బ్యాంకులకు చెందిన అధికారులతో సమీక్ష జరుపుతున్న సమయంలోనే సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం హుటాహుటీన తరలించారు. గత నెలలో గుండె సంబంధిత సమస్య కారణంగా ఉద్యోగానికి సెలవు పెట్టిన సమీర్ శర్మ… హైదరాబాద్ వెళ్లి గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన స్థానంలో ఏపీ ఇంచార్జీ సీఎస్ గా విజయానంద్ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆపరేషన్ ముగించుకుని వచ్చిన సీఎస్ సమీర్ శర్మ ఉన్నట్టుండి సమీక్షా సమావేశంలోనే అస్వస్థతకు గురయ్యారు.