డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
జోనల్ స్థాయి బ్యాడ్మింటెన్ పోటీలు ప్రారంభం
విశాలాంధ్ర` విజయనగరం : సిఎం ప్రైజ్ మనీ కప్ ద్వారా, ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహనరెడ్డి క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రైజ్ మనీ కోసం ప్రభుత్వం రూ.50లక్షలను కేటాయించినట్లు తెలిపారు. జోనల్ స్థాయి సిఎం ప్రైజ్మనీ కప్ బ్యాడ్మింటెన్ పోటీలను స్థానిక డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో, గురువారం కోలగట్ల ప్రారంభించారు. క్రీడాకారుల వందనాన్ని స్వీకరించారు. ఈ పోటీల్లో విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు తదితర జిల్లాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన అనంతరం కోలగట్ల మాట్లాడుతూ, ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని అన్నారు. సిఎం ప్రైజ్మనీ కప్ ద్వారా కబడ్డీ, బ్యాడ్మింటెన్, క్రికెట్, వాలీబాల్ క్రీడల్లో జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రతిభను నిరూపించుకోడానికి ఇది రాష్ట్రంలోని క్రీడాకారులకు సువర్ణావకశామని పేర్కొన్నారు. క్రీడలతో శారీరక ధారుఢ్యంతోపాటు, మానసిక వికాశం కూడా కలుగుతుందని చెప్పారు. క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, ఉద్యోగాల్లో క్రీడాకారుల కోటాలను కూడా భర్తీ చేస్తూ, క్రీడాప్రతిభ ఉన్నవారికి అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. క్రీడాకారులు గెలుపోటములకు అతీతంగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభను చూపించి, జిల్లాకు, మన జోన్కు మంచిపేరు తేవాలని కోలగట్ల ఆకాంక్షించారు. జగనన్న క్రీడా సంబరాల బ్రోచర్ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఛీఫ్ కోచ్ అప్పలనాయుడు, విజయనగరం బ్యాడ్మింటెన్ అసోసియేషన్ కార్యదర్శి కుసుమ బచ్చన్, సిటీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విఎస్ ప్రసాద్, క్రీడా సంఘాల నాయకులు ఎంబికె, రమణ, శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.