ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ (జేసీ) ముందుంచాలని ఆ తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. అలాగే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సినిమా టికెట్ ధరలను నియంత్రిస్తూ ఏప్రిల్ 8న జీవో నెంబర్ 35ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ థియేటర్ల యజమానులు, ప్రొడ్యూసర్లు కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన తర్వాత.. జీవోను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు సింగిల్ బెంచ్ జడ్జి. జీవో 35కు ముందు అనుసరించిన విధానంలోనే టికెట్ ధరలను నిర్ణయించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ యాజమానులకు కోర్టు వెసులుబాటు కల్పించింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.