సీనియర్ సినీ నటుడు మురళీమోహన్కు ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది.తన దగ్గర స్థలం తీసుకుని మోసం చేశారని ఒక భూయజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళీమోహన్తోపాటు అతని కుటుంబసభ్యుల మీద ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 41 ఏ సెక్షన్ కింద నోటీసు ఇచ్చి గురువారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే, దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన మురళీ మోహన్, అతని కుటుంబ సభ్యులు సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టులో క్వ్యాష్ పిటీషన్ వేశారు.మురళీ మోహన్ తరపున క్వ్యాష్ పిటీషన్ వేసి సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తన క్లయింట్ తరపు వాదనలు హైకోర్టుకు వినిపించారు. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మార్చడం పట్ల హైకోర్టు ముందు మురళీ మోహన్ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జయభేరీ ప్రాపర్టీస్ సంస్థ సదరు వ్యక్తితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏమాత్రం ఉల్లంఘించలేదని మురళీ మోహన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో అన్ని రకాల తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.