ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడతామని..దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. భూములకు సంబంధించి కొన్ని చోట్ల రికార్డుల్లో ఒక మాదిరిగా..క్షేత్రస్థాయిలో మరో విధంగా ఉంటోందని అన్నారు. సివిల్ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మంగళవారం ఆయన 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామ కంఠాల్లోని స్థిరాస్తుల సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని.. అన్ని గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. భవిష్యత్లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. భూముల ఆక్రమణలు, నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తున్నామని అన్నారు.