తన మాజీ డ్రైవర్ను హత్య చేశారనే కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. దళితుడ్ని చంపి, జైలుపాలైన ఎమ్మెల్సీ అనంతబాబును వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలనే తపన ప్రభుత్వంలో అణువణువునా కనిపిస్తోందని అన్నారు. ఈ ప్రభుత్వం హత్యగావించబడిన దళితుడి వైపా? లేక అధికారమదంతో హత్య చేసిన అనంతబాబు వైపా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారి దళితవాదం నేతి బీరకాయలో నెయ్యేనా? అని ఎద్దేవా చేశారు.