విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బృందం బుధవారం భేటీ అయింది. మనోజ్ అహూజా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్య కార్యనిర్వహణాధికారి రితేష్ చౌహాన్, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయక కమిషనర్ కె.సునీల్, నోడల్ ఆఫీసర్ అజయ్కరన్ బృంద సభ్యులు సీఎంను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనతో భాగస్వామ్యం కావాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో జరిగిన సమావేశంలో, ఈ మేరకు ప్రాథమికంగా సీఎం జగన్ అంగీకరించారు. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు, అలాంటి రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్ బీమా యోజనలో చక్కటి మోడల్ను పొందుపరచాలని సీఎం కోరారు. ఈ మోడల్ను ఖరారు చేయగానే రాష్ట్రంలోనూ అమలుకు కేంద్రంతోపాటు కలిసి భాగస్వామ్యం అవుతామన్నారు. అంతకుముందు గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, అక్కడ నుంచి వణుకూరులోని రైతు భరోసా కేంద్రం, కంకిపాడులో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ను కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బృందం సందర్శించింది. అహూజా మాట్లాడుతూ, సామాజిక తనిఖీల కోసం జాబితాలు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించడం చాలా బాగుందని చెప్పారు విద్యా, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించిన కేంద్ర బృందం అభినందించింది.