విశాలాంధ్ర బ్యూరో `అమరావతి : ఏపీ పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబరుగా నియమితులైన మాజీ ఐఏఎస్ అధికారి బి.ఉదయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, అథారిటీ చైర్మన్ కనగరాజన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పోలీసు కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. పోలీసు అధికారుల పనితీరు మెరుగుపర్చడానికి, కేసుల దర్యాప్తులో పారదర్శకతకు బాధ్యతాయుత పోలీసింగ్ కోసం శాయ శక్తులా పని చేస్తానని చెప్పారు. పోలీసు అధికారుల తీరుతో వ్యక్తుల ప్రాణానికి, స్వేచ్చకు విఘాతం కలిగిన సందర్భంలో అథారిటీ స్పందించి రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. పోలీసులు డబ్బుకు, ఒత్తిళ్లకు లొంగి చట్ట ప్రకారం నడుచుకోకపోతే పోలీసు కంప్లైంటు అథారిటీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.