విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియంలో కొనసాగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను, వేడుకల సన్నద్ధతను డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం పరిశీలించారు. పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు. సవాంగ్ మాట్లాడుతూ ఈ వేడుకలకు సీఎం జగన్ హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా దృష్ట్యా ముఖ్య అతిథులకు పరిమిత స్థాయిలోనే సందర్శనకు అనుమతిచ్చినట్లు వివరించారు. వర్షంలో సైతం పరేడ్కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరూ కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
డీజీపీని కలిసిన సింధు : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు శుక్రవారం డీజీపీ సవాంగ్ను కలిసింది. రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచస్థాయిలో పతకం సాధించడం గర్వకారణమని డీజీపీ కొనియాడారు. ఆమె సాధించిన విజయం మహిళలకు, యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.