కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహారదీక్షకు దిగిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 11 గంటల సమయంలో జోగయ్య ఇంటికి చేరుకున్న దాదాపు 400 మంది పోలీసుల భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్సులోకి ఎక్కించి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనను చూసేందుకు ఆసుపత్రిలోకి ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు. హరిరామ జోగయ్య చేస్తున్న ఆమరణ దీక్షపై ప్రభుత్వం స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.కాపు రిజర్వేషన్ కోసం హరిరామజోగయ్య ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న హరిరామ జోగయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.85 సంవత్సరాల వయసులో ఆయన దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నాను. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం తక్షణం చర్చలు చేపట్టాలి’ అని చెప్పారు.