అందుకోసం తాను దేనికైనా సిద్ధమే : బాలకృష్ణ
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, అందుకోసం తాను దేనికైనా సిద్ధమేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సి ఉందన్నారు. జిల్లాకు ఏ పేరు అయినా పెట్టుకోవాలని.. తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. అధికార వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి తమ కార్యాచరణ కూడా ఉంటుందని.. అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారన్నారు. జిల్లాల ప్రకటన తర్వాత ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. దానిపైన ఎలాంటి యాక్షన్ లేదన్నారు. ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉంటే ఇలా చేస్తారా..? అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పెట్టడం.. ఏ ప్రేమతో పెట్టారు అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంపై ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు.