అమరావతి రైతుల మహాపాదయాత్ర 12వ రోజుకు చేరింది. ఈరోజు మచిలీపట్నం నుంచి కౌతవరం వరకు ర్యాలీ కొనసాగనుంది. యాత్రలో పెద్దసంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తున్న రైతులకు దారిపొడువునా రైతులు, ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై దాడి జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ… జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పరాన్న జీవులుగా మంత్రులు… జగన్ ఏం చెప్పినా తానా అంటున్నారన్నారు. పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో పాదయాత్రపై దాడికి కుట్ర చేశారనే సమాచారం ఉందని… తమకు సంఫీుభావంగా వచ్చే స్థానిక ప్రజలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తమకు ఏ ప్రమాదం జరిగినా జగన్ దే బాధ్యత అని అన్నారు. డీజీపీ స్పందించి తమకు తగిన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.