25న నోటిఫికేషన్ జారీ
ఇక్బాల్, రామచంద్రయ్యపై అనర్హత వేటుతో ఖాళీలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకుగాను ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది. జులై 12న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది. వైసీపీ ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికల నిమిత్తం ఈనెల 25న నోటిఫికేషన్ జారీ చేస్తారు. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వాటి ఉపసంహరణకు 5వ తేదీ వరకు గడువు ఇస్తారు. ప్రస్తుతం శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో, ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోనుంది. ఎన్నికల ముందు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, వంశీకృష్ణ యాదవ్, ఇందుకూరి రఘురాజు పార్టీని వీడారు. వారిపై శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్రాజుకు వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. వారిపైనా అనర్హత వేటు వేశారు. దీంతో వాటికి కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఏపీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు బలంగా ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయినప్పటికీ, ఎమ్మెల్సీల్లో మాత్రం బలం తగ్గలేదు. ఇటీవల ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్… ఎమ్మెల్సీతో సమావేశం నిర్వహించి, రాబోయే రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం వైసీపీ ఫిర్యాదులతో అనర్హత వేటు వేసిన రెండు ఎమ్మెల్సీల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో అవి టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో ఆ మేరకు వైసీపీకి శాసన మండలిలో తన సంఖ్యా బలంలో రెండు స్థానాలు తగ్గనున్నాయి.