విశాలాంధ్ర` ఏలూరు: ఈనెల 17వ తేదీన ఏలూరు నగరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దళితుల సమరభేరి ర్యాలీని జయప్రదం చేయాలని టిడిపి ఎస్ సి సెల్ ఏలూరు పార్లమెంటు అధ్యక్షులు యాళ్ళ సుజినా రావ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక టిడిపి జిల్లా ప్రధాన కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో సుజినారావ్, బాలాజీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై కేసులతో వేధిస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దళితులంతా ఐక్యంగా తమ రక్షణ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గ చర్యలకు నిరసనగా టిడిపి ఎస్ సి సెల్ ఆధ్వర్యంలో ఈనెల 17న ఏలూరు నగరంలో స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ మధ్యాహ్నం గం.2లకు టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఈ ర్యాలీకి టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు, టిడిపి ఏలూరు, నరసాపురం, రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, తోట సీతామహాలక్ష్మి, కేఎస్ జవహర్ హాజరవుతారని తెలిపారు. ఈ ర్యాలీలో ఎస్ సి సెల్ విభాగం నందు వివిధ హోదాలలో ఉన్న కమిటీ సభ్యులు, పార్లమెంటు, అసెంబ్లీ, మండల, ఇతర అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, నగర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మోజస్, నగర ఎస్ సి సెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, మాజీ ఎంపీపీ లంకలపల్లి మాణిక్యాలరావుతదితరులు పాల్గొన్నారు.