నిరుద్యోగ యువత, విద్యార్థులు కదం తొక్కాలి
తిరుపతి ‘నిరుద్యోగగర్జన’లో ఏపీ ఉద్యోగ పోరాటసమితి పిలుపు
విశాలాంధ్ర బ్యూరో` తిరుపతి : ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేసేలా ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీన ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి’ ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి, బైరాగి పట్టెడలోని సీపీఐ కార్యాలయం గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్లో పోరాట సమితి అధ్వర్యాన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండి చలపతి , తెలుగు యువత తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు రవి నాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్య దర్శి మాధవ్ అధ్యక్షతన నిరుద్యోగ గర్జన సదస్సు నిర్వహించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్రలు మాట్లాడుతూ.. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా ఉన్న జాబ్ క్యాలెండర్ ను తక్షణం రద్దు చేసి, రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల పై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ లో ఖాళీగా ఉన్న 16 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంలో, మన్నవరం బెల్ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు 25 వేలకు పైగా ఖాళీగా ఉంటే ఈ జాబ్ క్యాలెండర్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఊసే లేకపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై పునరాలోచించాలని లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాలు, నిరుద్యోగులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘‘హలో నిరుద్యోగి..చలో విజయవాడ’’ నినాదంతో నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు కదం తొక్కుతూ 19న జరిగే చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.శశికుమార్, జిల్లా అధ్యక్షుడు ఉదయ్, టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు కొట్టే హేమంత్ రాయల్, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు రామకృష్ణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు చిన్న సురేష్, ప్రవీణ్ వెంకీ, తరుణ్, మూర్తి, డీవైఎఫ్ఐ నాయకులు సందీప్, వెంకట స్వామి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పవన్ కళ్యాణ్, మోహన్ రాయల్, శ్రీనివాస్ యాదవ్, శ్రీరాం బాబీ, వంశీ యాదవ్, ఢల్లీి రెడ్డి, వసంత్, తారక్, హరి, నవీన్. ఏఐవైఎఫ్ నాయకులు పూర్ణ, డీవైఎఫ్ఐ నాయకులు నరేంద్ర, సుమన్, ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ నాగరాజు, నిరుద్యోగులు పాల్గొన్నారు.