Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పాలకుల మెడలు వంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం

పార్టీ శ్రేణులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర – చింతపల్లి: ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడలు వంచాలనీ, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి లో గిరిజన ఉద్యోగ భవనం వద్ద సీపీిఐ జిల్లా కన్వీనర్‌ పొట్టిక సత్యనారాయణ అధ్యక్షతన మంగళ వారం పార్టీ జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ముందుగా పార్టీ జెండాను స్థానిక సీనియర్‌ నాయకుడు సెగ్గే కొండలరావు ఆవిష్కరించారు. రామకృష్ణ ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్ర రాష్ట్రాలలో బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు నియంత పరిపాలన సాగిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యం అంటే విలువ లేని విధంగా కేంద్ర, రాష్ట్రాలలో వీరిద్దరూ తయారయ్యారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేకుండా ప్రజాకంటక పాలన కొనసాగిస్తు న్నారన్నారు. కేంద్రంలో బీజేపీి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తున్నదన్నారు. అంబానీ, అదానీలకు తొత్తులుగా తయారై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పరిపాలన సాగిస్తున్న బీజేపీ, వైసీపీలను ఇళ్లకు సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రంలో ఎనిమిదేళ్ల బీజేపీ, రాష్ట్రంలో మూడేళ్ల వైసీపీ ప్రభుత్వాలు ప్రజలకు చేసింది శూన్యమన్నారు. మద్య నిషేధం అమలు చేస్తామని హామీలు గుప్పించిన జగన్‌మోహన్‌ రెడ్డి పాత బ్రాండ్లను నిషేధించి తన బ్రాండ్లను తీసుకువచ్చి ఖజానాను నింపుకుంటున్నాడన్నారు. వీరి ద్వయాన్ని ఇళ్లకు సాగనంపకుంటే దేశం అధోగతి పాలవుతుందనీ దీన్ని దృష్టిలో ఉంచుకొని అల్లూరి పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిటిష్‌ పాలకుల దాస్య శృంకలాల నుంచి గిరిజనులను చైతన్యపరచి వారిలో పోరాట స్ఫూర్తిని నింపిన అల్లూరి నడయాడిన ఈ ప్రాంతానికి చరిత్ర ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి సీపీిఐ పార్టీ నాయకులు పోరాట స్ఫూర్తిని నింపుకొని 40 వేల ఎకరాల భూమిని పేద గిరిజనులకు పంచడంతోపాటు అనేక గ్రామాల స్థాపనకు కారకులు అయ్యారన్నారు. అటువంటి పోరాట పురిటి గడ్డలో సర్పంచ్‌, ఎంపీటీసీ స్థాయిల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. అదే స్ఫూర్తితో రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని రామకృష్ణ అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శి వర్గ సభ్యుడు రావుల వెంకయ్య, కార్య వర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ, తాటిపాక మధు, గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి మొట్టడం రాజబాబు, సుంకర విష్ణుమూర్తి, రంపచోడవరం నియోజకవర్గ నాయకు లు కందుకూరి స్వర్ణ, చింతపల్లి, జికే వీధి మండలాల కార్యదర్శులు పేట్ల పోతురాజు, కంకిపాటి సత్తిబాబు, అంజలి శనివారం సర్పంచ్‌ పేట్ల రాజబాబు, ఎర్ర బొమ్మల ఎంపీటీసీ సభ్యుడు ఎస్‌ సత్తిబాబు, షేక్‌ రహిమాన్‌, గంజారి రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img