ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిపిందే. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద ఆగిఉన్న గూడ్స్ రైలును కోల్ కతా నుంచి చెన్నై వెళుతున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ ఎఫ్, ఒడిశా విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హృదయవిదారకరమైన ఈ సంఘటనపై టాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో 237 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ నేపథ్యంలో స్పందించిన టాలీవుడ్ స్టార్స్ తగిన సహాయం అందిస్తామని, తమ వంతు సహాయ సహకారాలు అందించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన రక్తదానం చేయాలని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.ఒడిశాలో జరిగిన విషాదకరమైన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం, దాని వల్ల జరిగిన భారీ ప్రాణ నష్టం గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు భారీగా రక్త యూనిట్లు అవసరం ఉందని నేను అర్థం చేసుకున్నాను. సాధ్యమైనంత వరకు వెంటనే రక్త యూనిట్లని అందించాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
అని ట్వీట్ చేశారు.
ఇక స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కరమన్నారు. ఒడిశా రైలు ప్రమాదం తీదిగ్భ్రాంతికి లోనే చేసింది. ఈ ప్రమాదంలో 278 మంది ప్రయాణికులు మృత్యు వాత పడటం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు -హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణికులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాను. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటన నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి` అని అధికారిక ట్విట్టర్ ద్వారా ఓ లెటర్ని విడుదల చేశారు. ఈ ప్రమాద ఘటనపై స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్న ఎన్టీఆర్ ఈ సందర్భంగా ప్రమాదంపై తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉంటూ బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.