ముఖ్యమంత్రికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మునిసిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు చేపట్టి, సమ్మెను ప్రభుత్వం విరమింపచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు మంగళవారం ఆయన లేఖ రాశారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించిన హెల్త్ అలవెన్స్ బకాయిలు విడుదల చేయాలని, పర్మినెంట్, ఆప్కాస్ ద్వారా ఎదురౌతున్న సమస్యలు, రిట్కెర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యూటీ, పెన్షన్, సమాన పనికి సమాన వేతనం, సిబ్బంది పెంపుదల వంటి తదితర న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 11వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు. ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత కసం శ్రమిస్తున్న మునిసిపల్ కార్మికుల సమస్యలు మూడేళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. మున్సిపల్ రంగంలోని ఒప్పంద, పొరుగు సేవల కార్మికులు, ఎన్ఎంఆర్, స్వీపర్లు, పూర్తి స్థాయి కార్మికుల సమస్యలు సమస్యల్ని పరిష్కరించలేదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక పనిచేశారన్నారు. గత ఎన్నికలకు ముందు మున్సిపల్ సిబ్బందికి జగన్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 11వ తేదీ నుంచి నుండి సమ్మెబాట పట్టారని పేర్కొన్నారు. వానను సైతం లెక్కచేయక కార్మికులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారనీ, అసలే వర్షాకాలం కారణంగా పారిశుథ్యం లోపించి, వ్యాధులు ప్రబలే ప్రమాదముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టి, సమ్మె విరమించాలని డిమాండ్ చేశారు.