టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమలలో గంజాయి పట్టుబడటంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. తిరుమలలో గంజాయి వార్త షాక్ కు గురిచేసిందని.. రాష్ట్రంలో గంజాయి భూతం రోజురోజుకూ విస్తరిస్తోంది అనడానికి ఇదో సాక్ష్యం అన్నారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తుందన్నారు. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలన్నారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి ప్రదేశ్ అయ్యింది అంటూ మండిపడ్డారు. బడిలో, గుడిలో గంజాయితో రాష్ట్రం పరువు మంటగలిసిపోయిందని.. చివరికి ప్రపంచ ప్రఖ్యాత హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలలో గంజాయి గుప్పుమంటోంది అన్నారు. టీటీడీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి 125 గ్రాముల గంజాయితో ఎస్ఈబీ పట్టుకుందని ట్వీట్ చేశారు. దొరకని గంజాయి గజదొంగలు కొండపై ఇంకెందరు ఉన్నారో.. ఇందుకా జగన్ నువ్వు ఒక్క ఛాన్స్ అడిగింది అంటూ ధ్వజమెత్తారు.తిరుమలలో గంజాయి పట్టుబడింది. విజిలెన్స్ అధికారులకు గంజాయి గురించి పక్కాగా సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కంప్లెక్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధరం తీరు అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే అతడి దగ్గర తనిఖీ చేయగా.. 125 గ్రాముల గంజాయి దొరికింది. అతడ్ని అదుపులోకి తీసుకుని ఎస్ఈబీ పోలీసులకు అప్పగించారు. అలిపిరి టోల్గేట్ దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నా.. కొండపైకి గంజాయి చేరడం కలకలంరేపింది.