రామకృష్ణ విమర్శ
విశాలాంధ్ర బ్యూరో-బాపట్ల : వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక దొంగలుగా మారారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బాపట్ల పట్టణంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సహజ సంపదను మింగేస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ఇసుకదోపిడీపై డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ వీజీ వెంకటరెడ్డి ఏ ప్రాంతంలో ఎంత ఇసుక తవ్వారు అనే వివరాలు వెంటనే అందించాలంటూ సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. అధికారులు, పాలకులు కుమ్మక్కై ఇసుక దోచేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే…అటువంటిదేమీ లేదని చెప్పిన అధికారులు…ఇప్పుడు సర్క్యులర్ ఎందుకు ఇచ్చారని రామకృష్ణ ప్రశ్నించారు. జేపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇసుక కాంట్రాక్టు ఇచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దొంగలు పడ్డారన్నారు. ఇసుక మాఫియాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే స్వయంగా ఉన్నారని చెప్పారు. ఎంతఇసుక రాష్ట్రంలో తీసింది… ఎంత అమ్మకం చేసింది తేల్చలేదని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని విమర్శించారు. జె బ్రాండ్ లిక్కర్ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కు వెళుతున్నాయన్నారు. పకృతి సంపదను దోచుకుంటున్న వారు అసెంబ్లీలో నీతిమంతుల్లా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దోపిడీదారులు, దగాకోరులు, అవినీతిపరులకు అసెంబ్లీలో కూర్చునే అర్హత లేదన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్కుమార్, బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, సీపీఐ సీనియర్ నాయకులు జేబీ శ్రీధర్ ఉన్నారు.