సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా విచారణను వేగవంతం చేసిన ఈడీ
APలో వైకాపా ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.ఇప్పటికే ఈ కేసులో పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు అందడం చర్చనీయాంశమైంది.మద్యం సరఫరాదారులు, డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించి, ఆ డబ్బును హవాలా మార్గంలో ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు తరలించినట్లు అభియోగాలున్న నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికే సేకరించిన కీలక పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా ఈడీ విచారణను మరింత వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ
-ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తున్న నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు); మండల పరిధిలోని హులికన్వి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ చిన్న మహదేవ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీల్లో మొత్తం 12 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో మొదటి స్థానంలో వెంకటలక్ష్మి, రెండో స్థానంలో తలారి అంజలి, మూడో స్థానంలో నాగవేణి నిలిచారు. మొదటి స్థానంలో నిలిచిన వెంకటలక్ష్మికి 2500 రూపాయలు ఓబులేశు, రెండో స్థానంలో నిలిచిన తలారి అంజలికి 2000 రూపాయలు ఈడిగ వెంకటేశ్వర్లు గౌడ్, మూడో స్థానంలో నిలిచిన నాగవేణికి 1500 రూపాయలు గవిగట్టు తిమ్మప్పలు బహుమతులు అందజేశారు. అలాగే నాల్గో స్థానంలో నిలిచిన సింధూకు 1000 రూపాయలు తలారి సంతోషమ్మ, ఐదో స్థానంలో నిలిచిన లక్ష్మీకుమారికి 1000 రూపాయలు బాపులదొడ్డి నర్సిరెడ్డి, ఆరోస్థానంలో నిలిచిన దేవేంద్రమ్మకు 1000 రూపాయలు బాపులదొడ్డి మహదేవ, ఏడో స్థానంలో నిలిచిన జ్యోతికి 500 రూపాయలు అందజేశారు. మిగిలిన 5 మంది మహిళలకు ప్లేట్లు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గవిగట్టు గ్రామ సర్పంచ్ నాగరాజు, పీకలబెట్ట వైసీపీ నాయకులు మూకిరెడ్డి, యల్లప్ప, కడబూరి, తిమ్మప్ప, టీడీపీ నేతలు హనుమంతు, ఓబులేశు, గ్రామ పెద్దలు పెద్ద మహదేవ, తిమ్మప్ప, నల్లారెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
ప్రతిభ కనిపించిన కళాకారులకు నగదు బహుమతులు
-మంత్రి సత్య కుమార్ యాదవ్ దంపతులు నగదు బహుమతులు అందజేశారు.
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయ క్రీడలు పోటీలు ఘనంగా ఎన్డీఏ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ దంపతులు, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కోడి పందాలు ,రాతి దూలం లాగుట, మహిళల ముగ్గుల పోటీలు, మహిళల కబడ్డీ, 120 కిలోల ఇసుక సంచులను ఎత్తే పోటీలను వారు అధికారికంగా ప్రారంభించారు. మహిళల ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతికి 25,000, ద్వితీయ బహుమతికి 15000, తృతీయ బహుమతిగా 10,000 రూపాయలు మంత్రి సతీమణి, ఎస్పీ సతీష్ కుమార్ సతీమణి ధరణ్య చేతులమీదుగా నగదు బహుమతులను అందజేశారు. మహిళల కబాడీ పోటీలలో మొత్తము 7 జట్లు పాల్గొనగా ఫైనల్స్లో ధర్మవరం కబడ్డీ జట్టు అనంతపురం కబడి చెట్లతో తలపడగా ధర్మవరం జట్టు విజేతగా నిలిచింది, అనంతపురం జట్టు రన్నర్పుగా నిలిచింది. విజేతగా నిలిచిన ధర్మారం జట్టుకు 25వేల రూపాయల ప్రధమ బహుమతి రన్నర్పుగా నిలిచిన అనంతపురం జట్టుకు 15వేల రూపాయల బహుమతులను కూడా అందజేశారు. అలాగే 120 కిలోల ఇసుక సంచులను ఎత్తే పోటీల్లో దుర్గ విజేతగా నిలిచి 15 వేల రూపాయలు ప్రథమ బహుమతి పొందగా, రాముడు ద్వితీయ బహుమతిగా పదివేల రూపాయలు, నరేష్ తృతీయ బహుమతిగా ఐదు వేల రూపాయలు పొంది నగదు బహుమతులను దంపతులు చేతులు మీదుగా అందుకున్నారు. అనంతరం కళాకారులు ఎన్డీఏ నాయకులకు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం మాకు ఎంతో సంతోషదాయకమని తెలుపుతూ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆర్థిక సమస్యలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కూలి రైలు కిందపడి ఆత్మహత్య
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కృష్ణా రెడ్డి గ్రామంలో రైల్వే బ్రిడ్జి వద్ద పొలములలో సిమెంట్ పోల్స్ ను అమర్చే పనిలో భాగంగా కూలీలుగా శివం అనే కూలీతో పాటు అన్న బ్రిడ్జు, మరో తమ్ముడు డీఫిన్(ముగ్గురు) పనిచేస్తూ గత 25 రోజులుగా జీవనం కొనసాగించేవారు. ఇందులో భాగంగా శివం (27) తన భార్య సాధనతో ఆర్థిక సమస్యలతో మాట్లాడుతూ, ఆ సమస్యలు తీరకపోవడంతో ఏం చేయాలో తోచక బుధవారం అర్ధరాత్రి సమయంలో శివం అనుకోకుండా అందరూ నిద్రిస్తుండగా బయటికి వెళ్లిపోయాడు. తదుపరి ఓ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున రైల్వే గేట్మెన్ చూసి సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందించారు. తదుపరి ధర్మవరం ఆర్పిఎఫ్ ఎస్ఐ రోహిత్ కుమార్, జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ చాంద్బాషా ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చుట్టుపక్కల గ్రామాలలో వారు విచారణ చేయగా, ముగ్గురు అన్నదమ్ముల్లో అన్న బ్రిడ్జూ తన తమ్ముడే శివాని గుర్తుపట్టాడు. అనంతరం రైల్వే పోలీసులు శవానికి పోస్టుమార్టం చేయించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. తదుపరి ఆర్పిఎఫ్ , జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయం
-మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం; భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలిచాయని మున్సిపల్ కమిషనర్ సాయికృష్ణ తెలిపారు. భోగి, సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తేరు వద్ద సంక్రాంతి సంబరాలు లో భాగంగా భోగి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో విశిష్టత కలిగి ఉన్నాయని ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శంగా నిలిచాయన్నారు. ఒక్కో పండుగకు ఒక్కో విశిష్టత ఉందని, సంక్రాంతి పర్వదినానికి సైతం ఎంతో విశిష్టత ఉందని నేటితరం మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కలవల నాగ తేజ, అంబటి అవినాష్, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పో డమల రూపరాగిణి, నల్లపేట మంజు సంయుక్త, వాసవి క్లబ్ అధ్యక్షులు కాకుమాని వెంకట సాయి, కార్యదర్శి నాగ వినయ్, కోశాధికారి గుండా గణేష్, డిస్టిక్ రీజినల్ కార్యదర్శి సనత్ కుమార్, కోటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవిసంకీర్తన మహిళా మండలి, నగర సంకీర్తన బృందం
సభ్యులు పాల్గొన్నారు.
ధర్మవరం పట్టణంలో సంక్రాంతి సంబరాలు
– సంప్రదాయ నాట్య, తోలుబొమ్మలాట ప్రదర్శనలతో కళకళలాడిన ధర్మవరం కాలేజ్ గ్రౌండ్
విశాలాంధ్ర ధర్మవరం; సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమం సంప్రదాయ నాట్య ప్రదర్శనలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలు, రైతుల జీవితాన్ని ప్రతిబింబించే నృత్యాలతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరై, సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించారు. నాట్య ప్రదర్శనలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలను మంత్రి ఆసక్తిగా, తీక్షణంగా వీక్షించారు. మానసా నృత్య కళానికేతన్ వారి ఆధ్వర్యంలో వినాయక సాంగ్, భస్మాసుర నృత్యం, మహిషాసుర మర్ధిని వంటి పలు అద్భుతమైన సంప్రదాయ నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా శ్రీలక్ష్మి చెన్నకేశవ సొసైటీ వారి ఆధ్వర్యంలో భక్తి గీతాలు, సుందరకాండ ఇతివృత్తంతో రూపొందించిన తోలుబొమ్మలాట ప్రదర్శనలు ప్రేక్షకులను ఆధ్యాత్మికంగా అలరించాయి. ఇదే సందర్భంలో చందు డాన్స్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో వినాయక సాంగ్కు నృత్యం, అలాగే రైతుల జీవితం, వారి కష్టాలను ప్రతిబింబించే పాటకు ప్రత్యేక నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ నృత్యాలు ప్రేక్షకుల హృదయాలను తాకగా, మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా ఈ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ మన భారతీయ సంప్రదాయ కళలు, నృత్యాలు, తోలుబొమ్మలాట వంటి ప్రజా కళారూపాలు మన సంస్కృతికి ప్రాణం. నేటి యువత ఈ కళలను తెలుసుకుని, నేర్చుకుని, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదీ అని తెలిపారు. ప్రభుత్వం సంప్రదాయ కళాకారులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుంది అని అన్నారు.కళాకారుల ప్రతిభను అభినందిస్తూ, నాట్య ప్రదర్శనలు మరియు తోలుబొమ్మలాట ప్రదర్శనలు చేసిన కళాకారులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ మొమెంటోలు బహుమతిగా అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.ఈ కార్యక్రమం ద్వారా ధర్మవరం పట్టణంలో సంక్రాంతి పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా, సంప్రదాయ వైభవంతో అత్యంత ఉత్సాహభరితంగా ఈ వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బేకరీ షాప్ దగ్ధం
20 లక్షలు ఆస్తి నష్టం.. బేకరీ యజమాని అజయ్
విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల లక్ష్మీ శ్రీ బేకరీ షాపు శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ ఆఫీసర్ ఎం నర్సింలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అజయ్ అనే బేకరీ షాప్ యజమాని కొన్ని సంవత్సరాలుగా బేకరీ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగించేవాడని, అనుకోకుండా శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా షాపు దగ్ధమైందని తెలిపారు. బాధితుడు అజయ్ తెలిపిన మేరకు 20 లక్షల దాకా నష్టము వాటిలినట్లు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నైట్ బీట్ చేస్తున్న పోలీసులు మాకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన నాతో పాటు జిల్లా ఫైర్ ఆఫీసర్ మాధవ నాయుడు తదితర సిబ్బందితో అక్కడికి వెళ్లడం జరిగిందన్నారు. షట్టర్ తీయకపోవడంతో జెసిబి సహాయంతో వాటిని తొలగించి మా సిబ్బంది ద్వారా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్, బేకరీ కి సంబంధించిన యంత్రాలు, వాటి పరికరాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగిందని తెలిపారు. బాధితుడు అజయ్ బేకరీ షాప్ కు ఇన్సూరెన్స్ కూడా చేయలేదని తెలిపారు. తదుపరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. బాధితుడు అజయ్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా నేను బేకరీ షాప్ నడుపుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకునే వాడని తెలిపారు. అనుకోకుండా ఈ ఘటన కావడం వల్ల నేను దాదాపు 20 లక్షల వరకు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ముస్తఫా, రవీంద్రనాయక్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిస్టుల విలీనమే దేశ ప్రయోజనాలకు దిక్సూచి
కూనంనేని సాంబశివరావు
ఎన్నో కుట్రలు, ఎన్నెన్నో నిర్బంధాలు ఉరికొయ్యలను ఛేదించి చెరసాలల్లో పురుడు పోసుకొని భారత గడ్డపై నిండు నూరేళ్లు జీవించిన త్యాగాల గని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ). 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల వేడుకలను లక్షలాది మందితో కమ్యూనిస్టుల పురిటిగడ్డ అయిన ఖమ్మం పట్టణంలో ఈ నెల 18వ తేదీన జరపడానికి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. భారతదేశ చరిత్రలో మహత్తర ఘట్టంగా నిలవబోతున్న ఈ భారీ బహిరంగ సభకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరవుతున్నారు. 10 వేల మంది అరుణసైన్యం కవాతు చేయబోతన్నది. ఎర్ర సముద్రంగా మారబోతున్న ఖమ్మం బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌహార్ధ సందేశం ఇవ్వబోతున్నారు. నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఉజ్వల వేడుకలలో 20 వ తేదీన నిర్వహించే సెమినార్కు డి.రాజాతో పాటు సీపీిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బేబి, సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వార్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమత్రి భట్టి విక్రమార్క హాజరవుతున్నారు. కంసుడు శ్రీకృష్ణుడిని పుట్టుకతోనే అంతం చేయ ప్రయత్నించిన విధంగా భారత కమ్యూనిస్టు పార్టీని చెరసాలలోనే పసిగుడ్డు ప్రాయంలోనే బ్రిటీష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం అంతమొందించే ప్రయత్నం చేసింది. తుదకు బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించడంలో కమ్యూనిస్టు పార్టీ వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసింది.
కమ్యూనిస్టు పార్టీ పుట్టుక అవలోకనం : సీపీఐ పుట్టుకే శ్రామిక అంతర్జాతీయత, దేశభక్తితో మిళితమై ఉంది. వివిధ విభాగాలుగా ఉన్న దేశ భక్తులను, స్వాతంత్య్ర సమరయోధులను కమ్యూనిజం వైపు తీసుకువచ్చింది. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో నాలుగు ప్రధాన స్రవంతులు కలిశాయి.
1) మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విదేశాల నుంచి ఆ తర్వాత జర్మనీ, అమెరికా, టర్కీ, అఫ్గానిస్థాన్లో విప్లవ కార్యాచరణలో ఉన్న భారత జాతీయ విప్లవకారులు అక్టోబర్ విప్లవ ప్రభావం కిందకు వచ్చారు. యం.చటోపాధ్యాయ, బర్కాతుల్లాఖాన్, ఎంపిపిటి ఆచార్య, ఎం.ఎన్.రాయ్, అభని ముఖర్జిలు ఒక స్రవంతి.
2) సామ్రాజ్యవాదులు ఖలీఫాలపై జరిపిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఇండియాలోని ముస్లిం ప్రజలు యుద్దకాలంలో (1914-16) విదేశాలకు వెళ్లి విస్తృత ఇస్లామిక్ ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్మించిన ఉద్యమకారులు యుద్ధానంతరం మహత్తర హిజ్రత్ ఉద్యమానికి సంబంధించిన జాతీయ విప్లవకారులు కూడా అక్టోబర్ విప్లవ ప్రభావం కిందకు వచ్చారు. వారిలో మహ్మద్ అలీ సెపస్సీ, రహమత్ అలీఖాన్, ఫిరోజుద్దీన్ మల్సూర్, అబ్దుల్ మాజీద్, షౌకత్ ఉస్మానీ ముఖ్యులు.
3) స్వాతంత్య్ర సాధనలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగించే ఆలోచనతో విదేశాల నుంచి ఆయుధాల సేకరణకు కొన్ని గ్రూపులు విదేశాలకు వెళ్లాయి. కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులు ముఖ్యంగా పంజాబీలు 1913లో శాన్ఫ్రాన్సిస్కోలో ‘గదర్ పార్టీ’ స్థాపించారు. కామా గాటా మారు అనే ఒక ఓడను ఆయుధాలతో ఇండియాకు పంపించారు. ఆ పోరాటం విఫలమైన తర్వాత గదర్ పార్టీ ముఖ్యులందరూ భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. వీరిలో రతన్ సింగ్, సంతోష్ సింగ్, తెలుగువాడైన దర్శి చెంచయ్యలాంటి అనేక మంది ఉన్నారు.
4) భారతదేశంలో ఉన్న జాతీయ విప్లవకారులు, జాతీయ కాంగ్రెస్లో అంతర్భాగంగా పనిచేస్తున్న సోషలిస్టు కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది, అతివాదపక్షం, టెర్రరిస్టు సంస్థలు, ఖిలాఫత్ ఉద్యమ నాయకులు, గదర్ పార్టీ నాయకులు 1921-22 లో శాసనోల్లంఘన ఉద్యమం విఫలమయిన తర్వాత గాంధీజీ ప్రతిఘటన సిద్దాంతం పట్ల భ్రమలు కోల్పోయిన వ్యక్తులు, బృందాలు అక్టోబర్ విప్లవ ప్రభావంతో శాస్త్రీయ సోషలిజం వైపు ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత వీరే దేశంలో తొలి కమ్యూనిస్టు గ్రూపుల స్థాపకులయ్యారు. బొంబాయిలో డాంగే, మద్రాసులో సింగార్వేల్ చెట్టియార్, కలకత్తాలో ముజఫర్ అహ్మద్, లాహోర్లో ఇంక్విలాబ్ గ్రూపులకు చెందిన గులాం హుస్సేన్ తదితరుల కలయికతో 1925 డిసెంబర్ 26 న కాన్పూర్లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అయ్యింది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో, రైతాంగ పోరాటాలలో, స్వదేశీ సంస్థానాల్లో విముక్తి పోరాటాల్లోÑ సంఘ సంస్కరణలు, సామాజిక మార్పుల కోసం జరిగిన పోరాటాల్లో ఇంకా అనేక రీతుల్లో జరిగిన భారత ప్రజల విప్లవ ఉద్యమంలో పాల్గొన్న వారిలో అధికులు కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు.ఎంఎన్.రాయ్ ఆధ్వర్యంలో 1920 లో రష్యాలోని తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థాపక సమావేశంలో ఏడుగురు పాల్గొన్నారు. వారు ఎంఎన్.రాయ్, ఎలెన్ రాయ్, అభని ముఖర్జి, రోజా ఫిటింగోవ్, ఎంపిడిటి ఆచార్యులు ఉన్నారు. కార్యదర్శిగా మహ్మద్ షఫి ఎన్నికయ్యారు. ఎం.ఎన్.రాయ్ కృషిని గుర్తించినప్పటికి 1925 లో విదేశీ గడ్డపైన ఏర్పాటైన ఆ తేదీని పార్టీ సంస్థాపక తేదీగా పరిగణించరాదని ఉమ్మడి పార్టీ రోజుల్లోనే కేంద్ర కార్యదర్శి వర్గం అభిప్రాయపడిరది. ఆ విధంగా 1925 డిసెంబర్ 26 న సత్యభక్త ఆధ్వర్యంలో కాన్పూర్లో జరిగిన మహాసభలో ఏర్పాటైన కమ్యూనిస్టు పార్టీని సంస్థాపక దినోత్సవంగా గుర్తించారు. సింగార్వేల్ చెట్టియార్ మహాసభకు అధ్యక్షత వహించారు. ఎస్.వి.ఘాటే, జెపి భాగర్లూతా కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పుట్టిన పసిగుడ్డును పొత్తిళ్లలోనే చంపే కుట్రలో కమ్యూనిస్టులపై ఎన్నో కేసులు పెట్టారు. అందులో ముఖ్యమైనవి 1922 నాటి పెషావర్ కుట్ర కేసు. 1924 నాటి కాన్పూర్ కుట్రకేసు కాన్పూర్ కుట్ర కేసులో ముజఫర్ అహ్మద్, ఢాంగే, షౌకత్ ఉస్మానీ ఇరికించారు.
చరిత్రాత్మక మీరట్ కుట్ర కేసు : 1929 లో కలకత్తాలో అఖిల భారత కార్మిక మహాసభ జరిగిన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం 31 మంది కమ్యూనిస్టు నాయకులకు, ఇతర పెద్ద నాయకులనందరిని అరెస్టు చేసింది. ఈ కేసు విచారణ 1929 నుంచి 1933 వరకు నాలుగేళ్లు కొనసాగింది. కోర్టును ప్రచార వేదికగా తమ సైద్ధాంతిక విస్తరణకు కమ్యూనిస్టులు మీరట్ కుట్ర కేసును ఉపయోగించుకున్నారు.
లాహోర్ కుట్రకేసు : సైమన్ కమీషన్కు వ్యతిరేకంగా ఊరేగింపునకు నాయకత్వం వహిస్తున్న పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్పై బ్రిటీష్ పోలీసులు విచ్చలవిడిగా లాఠీఛార్జి చేయడంతో ఆయన మరణించారు. దానికి కారకుడైన శాండర్స్ను 1928 డిసెంబర్ 17 న భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు లాహోర్లో కాల్చి చంపారు. దీనికితోడు కేంద్ర శాసనసభలో 1929 ఏప్రిల్ 8న పార్టీ ఆదేశానుసారం భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్తు బాంబులు వేశారు. రెండు సంవత్సరాలు జరిగిన కోర్టు విచారణ సందర్భంగా దేశభక్తి గేయాలు పాడుకుంటూ, విప్లవం వర్ధిల్లాలి (ఇంక్విలాబ్ జిందాబాద్) అనే నినాదాలతో ‘మేరా రంగ్ దే బసంతి ఛోళా’ అనే పాటతో ఈ విప్లవ వీరులు కోర్టు హాల్లోకి ప్రవేశించేవారు. తదనంతరం 1931 మార్చి 23 న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీశారు. తదనంతరం భగత్ సింగ్ సహచరులు అందరూ కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
కమ్యూనిస్టు పార్టీ నిషేధం : కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రమాదకరంగా భావించిన బ్రిటీష్ ప్రభుత్వం 1934 జులైలో పార్టీని నిషేధించింది. ఈ నేపథ్యంలో 1932-34లో కమ్యూనిస్టులు కాంగ్రెస్లో అంతర్భాగంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అంతిమంగా సోషలిస్టు కాంగ్రెస్లోని కమ్యూనిస్టులతో పాటు మరెంతోమంది అభివృద్ది కాముకులు అక్టోబర్ విప్లవ ప్రభావంతో కాంగ్రెస్లోని వామపక్ష గ్రూపుగా ఏర్పడ్డారు. తదనంతరం అనేక మంది కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకులు సీపీఐలో చేరారు. వీరిలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్, కంభంపాటి సీనియర్, రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి ప్రముఖులు.
కమ్యూనిస్టు పార్టీ చేసిన వీరోచిత పోరాటాలు : ఒకనాటి అస్సాం రాష్ట్రం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న చాబర్ సిల్హెట్ జిల్లాలోని లోయ ప్రాంతంలో వీరోచిత కౌలు రైతుల పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ పోరాటవీరులు అనేక మంది కమ్యూనిస్టు పార్టీలో చేరారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా వర్లీ తెగకు చెందిన ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1946 లో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటుదారులు కమ్యూనిస్టు పార్టీ జెండాను చేతబూనారు. పశ్చిమబెంగాల్లోని కౌలు రైతులు చేసిన పోరాటం ‘‘తెభాగా’’ పోరాటం పేరుతో చరిత్ర ప్రసిద్ధమైంది. కేరళలోని తిరువాన్కూర్ సంస్థానంలో కొబ్బరిపీచు కార్మికుల, వ్యవసాయ కార్మికుల, మత్స్య కార్మికుల వీరోచిత పోరాటానికి పున్నప్ర వాయిలార్ (మలబార్) పోరాటంగా ప్రసిద్ధి. ఫ్రెంచ్ వలస పాలన నుంచి పుదుచ్ఛేరీ విముక్తి పోరాటం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగి విజయవంతమైంది. ఈనాడు పుదుచ్ఛేరిలో కమ్యూనిస్టు అగ్రనాయకులైన సుబ్బయ్యను ఆ రాష్ట్ర విముక్తి ప్రధాతగా గౌరవిస్తారు. భగత్ సింగ్ లాంటి జాతీయ విప్లవకారులు సోషలిస్టు సిద్ధాంతం పట్ల ప్రభావితమయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ తదితరులు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీని ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో భగత్ సింగ్ సహచరులైన అజయ్ ఘోష్, శివవర్మ, పండిత్ కిశోరీలాల్, విజయ కుమార్ సిన్హా, జయ్దేవ్ కపూర్, భగవతి చరణ్ ఛోప్రా, సుఖ్దేవ్ లాంటి వారు సీపీిఐలో చేరారు.
చిట్టగాంగ్ పోరాట యోధులు : చిట్టగాంగ్ పోలీస్ స్టేషన్లోని ఆయుధ కారాగారంపై దాడిచేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న కేసులో 1934 జనవరి 12 న అనేక మందిని ఉరి తీశారు. మిగిలినవారు కమ్యూనిస్టు పార్టీలో చేరారు. చిట్టగాంగ్ పోరాట యోధురాలు కల్పనా జోషి బహుకాలం పాటు సీపీిఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పిసి జోషిని వివాహం చేసుకున్నారు.
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం : 1946-51 మధ్య జరిగిన ఈ పోరాటం చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన సాయుధ పోరాటం. మూడు వేల గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాల భూమి రైతాంగానికి పంపిణీ, వెట్టి చాకిరి రద్దు లాంటి అనేక విజయాలు ఈ పోరాట విజయాలు. ప్రధానంగా నిజాం నవాబు లొంగిపోవడం, హైద్రాబాద్ రాష్ట్రం భారత్లో విలీనం సాయుధ పోరాట ప్రభావంతోనే జరిగాయి. విలీనం తర్వాత భారత సైన్యం, పోలీసులు కమ్యూనిస్టులపై దాడులకు పాల్పడటంతో జరిగిన రైతాంగ గెరిల్లా పోరాటంలో 4000 మందికి పైగా కమ్యూనిస్టులు మృతిచెందారు. 10 వేల మందిని డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టి మూడు, నాలుగు సంవత్సరాల పాటు చిత్రహింసలకు గురిచేశారు. మహిళలతో నగ్నంగా బతకమ్మలాడిరచారు. అన్ని నిర్బంధాలను తట్టుకొని నిలబడటమే కాకుండా 1952 లో జరిగిన ఎన్నికల్లో అటు మద్రాస్ రాష్ట్రంలోనూ, ఇటు హైద్రాబాద్లోని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కంటే అధిక స్థానాలు సాధించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల్లో (1946`51) కృష్ణాజిల్లాలో 102 మంది, గుంటూరు జిల్లాలో 70 మంది, కడప జిల్లాలో 7గురు, తూర్పుగోదావరి జిల్లాలో 15 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 27 మంది, తెలంగాణ సాయుధ పోరాటానికి సహకారం అందిస్తున్న నేపధ్యంలో అమరులయ్యారు.
తెలుగు రాష్ట్రాలలో తృటిలో తప్పిన అధికారం : 1952 ఫిబ్రవరిలో జరిగిన ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ఎన్నికల్లో ఆంధ్రా ప్రాంతంలో 140 అసెంబ్లీ స్థానాలు ఉండేవి, కాంగ్రెస్కు కేవలం 40 స్థానాలు మాత్రమే దక్కాయి. పార్టీపై నిషేధం అనంతరం కేవలం నెలాపది రోజుల్లోనే జరిగిన ఎన్నికల్లో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 61 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో కమ్యూనిస్టులు గెలిచారు. పార్టీ బలపర్చిన 13 మంది ప్రజాపార్టీ (ప్రకాశం పంతులు పార్టీ) అభ్యర్ధులు, 8 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీల కుట్రలవల్ల మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ కమ్యూనిస్టులు ఇతర ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలను కలుపుకొని అధికారంలోకి వచ్చే అవకాశం చేజారింది. స్వాతంత్య్రానంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో (1952) లో కమ్యూనిస్టులు జనతంత్ర ప్రజాసంఘటన (పిడిఎఫ్) నాయకత్వంలో పోటీచేసిన 44 స్థానాలకుగాను 36 స్థానాల్లో గెలిచారు. పార్లమెంట్ స్థానాలకు పోట ీచేసిన కామ్రేడ్ రావి నారాయణరెడ్డికి అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అనేక మంది జైల్లో ఉంటూనే గెలిచారు. ఆనాటి హైద్రాబాద్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అనగా మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్నాటకలోని 3 జిల్లాలు, తెలంగాణలోని 8 జిల్లాలు కలిసి ఉండేవి. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక స్థానాలు కమ్యూనిస్టు పార్టీ విజయ బావుటా ఎగరేసింది. ఆనాడు రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో మెజార్టీ స్థానాలు కమ్యూనిస్టు పార్టీ సాధించింది.
సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపు : సంపూర్ణ స్వరాజ్యం కోసం మొట్ట మొదట పిలుపు ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీనే. 1921లో అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభలో, 1922 లో ‘గయ’లో ఈ గళాన్ని వినిపించారు. కమ్యూనిస్టు నాయకులైన మౌలానా హస్రత్ మొహాని, స్వామి కుమారనంద ఈ నినాదం ఇచ్చారు. కమ్యూనిస్టుల ఉద్యమ ప్రభావం రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా కనిపించింది. దున్నేవాడికే భూమి నినాదంతో జమీందారి, జాగిర్ధారీ పాలనకు వ్యతిరేకంగా రైతు కూలీలను సమీకరించారు. భూ సమస్యను ఎజెండా మీదకు తెచ్చారు. కార్మికులు, కర్షకులతో పాటు మహిళలు, దళితులు, ఆదివాసీలు స్వాతంత్రోద్యమంలోకి వచ్చారు. మహిళా సమానత్వ హక్కును ఎజెండాలోకి తెచ్చారు. వరకట్నం, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా సీపీఐ అనేక ఉద్యమాలు చేసింది. కందుకూరి, గురజాడ వంటి వారి సంస్కరణోద్యమాలకు కమ్యూనిస్టు ఉద్యమం ఊపిరి పోసింది. అభ్యుదయ రచయితలను, కళాకారులను ప్రోత్సహించారు. ప్రజాకళలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. అనేక మంది ప్రజానాట్యమండలి కళాకారులు సీనీరంగంలో ప్రవేశించి రాణించారు. వారిలో నాగభూషణం, గుమ్మడి, అల్లు రామలింగయ్య, వి.మధుసూధన్రావు, తాతినేని ప్రకాశ్రావ్, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, జి.వరలక్ష్మి, జమున, మాదాల రంగారావు, ఇంకా అనేక మంది కమ్యూనిస్టు అభిమానులైన నటులు సినీరంగంలో ఒక వెలుగు వెలిగారు. శ్రీశ్రీ లాంటి మహాకవులు, సుద్దాల హనుమంతు లాంటి ప్రజాకవులు, గద్దర్, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, వందేమాతరం శ్రీనివాస్ లాంటి వారికి ప్రేరణ కమ్యూనిస్టు ఉద్యమమే. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అనేక పోరాటాలు నిర్వహించింది.
వెల్లువెత్తిన ప్రజా పోరాటాలు-వర్గ సంఘాల ఏర్పాటు : 1920లో కమ్యూనిస్టుల సహకారంతో ఏఐటియుసి, 1936లో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్), 1936లో అఖిల భారత విద్యార్ధి సంఘం, 1936లో వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు), 1936లో అభ్యుదయ రచయితల సంఘం, 1943 లో ఇండియన్ పీపుల్స్ థియేటర్స్ అసోషియేషన్ (ఇప్టా-ప్రజా నాట్య మండలి), ఏర్పాటు చేశారు.
సాంస్కృతిక ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాలు : ఇఫ్టా, ఆరసంలాంటి సాస్కృతిక సంఘాలు దేశవ్యాప్తంగా సాంస్కృతిక విప్లవానికి నాంది పలికాయి. దళితులు మందిరాల్లో ప్రవేశానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా, మూఢ నమ్మకాలకు, ఆచారాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ప్రజల్లో హేతువాద, శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి కృషి చేశారు. బాల్యవివాహాల రద్దుకు, అభ్యుదయ వివాహాలకు, సతీసహగమనం రద్దుకై అనేక పోరాటాలు చేశారు.
కమ్యూనిజం ఆవశ్యకత : దేశంలో కమ్యూనిజం ఆవశ్యకత, అవసరం ఎన్నడూలేని విధంగా ఈనాడు ఉంది. ఉద్యోగ భద్రత లేదు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలతో కొత్త రూపంలో శ్రమ దోపిడి జరుగుతున్నది. భావాన్ని, ప్రశ్నించేవారిని అణచివేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. కవులు, కళాకారులను మతోన్మాద ఆరాచకులు కాల్చి చంపుతున్నారు. సోషల్ మీడియాను ఒక యూనివర్శిటీగా మలుచుకొని విద్రోహపూరిత విషజ్వాలలను సమాజంలో విరజిమ్ముతున్నారు. ఆర్ధిక అసమానతలు ఎన్నడూలేని విధంగా పెరిగాయి. ప్రపంచంలోనే మనది 4 వ ఆర్ధిక వ్యవస్థ అంటున్నప్పటికీ సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అలీన విధానాన్ని గాలికి వదిలేసి అమెరికా ఆదేశాలను పాటించే స్థితికి దేశ పాలకులు వచ్చారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రపంచం ఆర్ధిక మాంధ్యంతో తల్లడిల్లిపోయినా భారతదేశ వ్యవస్థను బలంగా నిలపగలిగిన ప్రభుత్వరంగ సంస్థలైన బ్యాంకింగ్, ఇన్సూరెన్సు రంగాలను సరళీకరణ పేరుతో విదేశీ శక్తులకు, కార్పోరేట్ శక్తులకు స్వాధీన పరుస్తున్నారు. బొగ్గుగనులు, ఉక్కు కర్మాగారాలు, రైల్వే వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, ఆఖరికి అణుశక్తి లాంటి వ్యవస్థల్లో విదేశీయులను పెట్టుబడుల పేరుతో స్వేచ్ఛగా అనుమతిస్తున్నారు. ఈ దశలో దేశానికి కమ్యూనిజం అవసరం ఏనాడు లేనివిధంగా ఉంది. ప్రజలు కమ్యూనిస్టు వ్యవస్థను కోరుకుంటున్నారు. హిడ్మా, నంబూరి కేశవరావు వంటివారిని ఎన్కౌంటర్ పేరుతో హతమారుస్తుంటే కోట్లాది గుండెలు తల్లడిల్లుతున్నాయి. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, సురవరం సుధాకర్రెడ్డి, ఏచూరి సీతారాం లాంటి వారు మరణిస్తే కోట్లాది మంది నీరాజనాలు పలికారు.
ప్రపంచంలో బలమైన శక్తి కమ్యూనిజం : ప్రపంచ జనాభాలో మూడో వంతు అనగా 187కోట్ల జనాభా కలిగిన దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండడమే కమ్యూనిజం ఇంకెక్కడ ఉన్నది అనేవారికి జవాబు. చైనా, ఉత్తరకొరియా, వియత్నాం, లావోస్, కంబోడియా, శ్రీలంక, నేపాల్, లాటీన్ ఆమెరికా దేశాలు, బ్రెజిల్ లాంటి దేశాలలో కమ్యూనిస్టులు, వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. భారతదేశం లాంటి దేశాలలో కమ్యూనిస్టులు అధికారంలో లేకపోయినా కోట్లాదిమంది ప్రజాసంఘాలలో, కార్మిక సంఘాలలో సభ్యులుగా కొనసాగుతూ ప్రజాసమస్యలపైన నిరంతరం పోరాడుతున్నారు.
కమ్యూనిస్టుల ఐక్యత నేటి కర్తవ్యం : కమ్యూనిస్టు పార్టీ చీలికల వల్ల దేశంలో అణగారిన వర్గాలకు తీరని అన్యాయం జరిగింది. నక్సల్స్ పేరుతో, అర్భన్ నక్సల్స్ పేరుతో కమ్యూనిస్టులను, అభ్యుదయవాదులను అంతం చేస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థ మాత్రమే. మనిషి కేంద్రంగా పుట్టిన సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్దాంతం. మనిషి ఉన్నంతకాలం, మనిషిలో ఆలోచనలు, భావాలు, ప్రశ్నలు ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుంది. ఈ దశలో కమ్యూనిస్టుల ఐక్యత అంతిమంగా కమ్యూనిస్టుల విలీనమే దేశానికి, దేశ ప్రయోజనాలకు ఒక దిక్సూచి.
ఎంఎల్ఏ, కొత్తగూడెం
కార్యదర్శి సీపీఐ, తెలంగాణ రాష్ట్ర సమితి
ఏకాంత వేళల్లోసామూహిక వేదన ఈ కవిత్వం
ఆ మధ్యనే కదా…ఇతగాడి కవిత్వాన్ని భుజానకెత్తుకున్నాను. మళ్లీ మరోసారి ఇలా… వెంపర్లాడడమెందుకు… వేసారడమెందుకు. అతనిలో వెతుకులాటని బయటకు తీయాలనుకోవడమెందుకు. అతనొక్కడే నీకు కనిపించిన కవా… అతనిదే కవిత్వమా… ఇలా మాటిమాటికి కాగితంపై నీ ప్రేమను పంచుకోవడం అవసరమా. నువ్వు కాకపోతే మరొకరు రాస్తారుగా. నువ్వు కాకపోతే ఇంకొకరు అతని కవిత్వాన్ని మోస్తారుగా. నువ్వు కాకపోతే వేరొకరు చెబుతారుగా. నువ్వే రాయాలా. ఆ పసునూరి శ్రీధర్బాబు కొత్త కవిత్వ పొత్తం ఏకాంతం ఒక అతిథి చదివిన తర్వాత నా నుంచి నాకు ఎదురైన ప్రశ్నలు. వీటన్నింటికి నాకు నేను చెప్పుకున్న సమాధానం. నేనే రాయాలి. నేనే చెప్పాలి. నేనే అనుభవించి పలవరించానని ప్రకటించాలి. ఈ కవిత్వం నాకు నేను సంపాదించుకున్న స్వార్జితం. ఈ కవిత్వం నాకు నేను ముచ్చటపడిన వాక్యం. ఈ కవిత్వం నన్ను తన చుట్టూ తిప్పుకున్న మురిపెం. సముద్రం ముందు పదేపదే ఎందుకు నిలబడతాం. అలలు అలలుగా ఎగిసిపడాలనుకుంటాం. పూల ముందు…మేఘమాల కోసం… పచ్చి మట్టి వాసన కోసం… లే వరి కంకుల నుంచి వచ్చే లేలేత పాల కోసం ఎందుకు ఆశ పడతాం. అలాగే నేను ఈ పసునూరి శ్రీధర్బాబు కవిత్వం కోసం ఆరాటపడతాను. పడ్డాను. ఒకటా, రెండా….మూడున్నర దశాబ్దాల కవిత్వ ప్రయాణం మాది. ఎన్ని చదివాం. ఎంత వాదులాడుకున్నాం. ఎంత ఆనందపడ్డాం. ఎంత దుఃఖితులమయ్యాం. ఎంత వేదన చెందాం. ఆ పసునూరి శ్రీధర్బాబు రాసిన కవిత్వమే అయినా నుప్పుల నొప్పులన్నీ మావే కదా. అందుకే ఇలా మరోసారి రాసి ‘‘శ్రీధర్ మామా… నీ కవిత్వం సెలయేరురా నాయనా… నీ కవిత్వం జడ గంటల సవ్వడిరా… నీ కవిత్వం మంచు బిందువుని ఆహ్వానించిన లే మామిడి ఆకురా’’ అని చెప్పాలనిపించింది. చదువుకుంటున్నామంటూ విప్లవ నినాదాలమైనప్పుడే ఆ పేరు పరిచయం. కాకపోతే అది శ్రీకాకుళ ఘర్జనను వినిపించిన రాయలసీమ శ్రీరాములయ్య పేరు. మనసులో ముద్రించుకుపోయింది. ఆ పేరే ఈ శ్రీధర్బాబు తండ్రి శ్రీరాములు. ప్రాంతం వేరైనా ఆకలి, కవిత్వం వేరు కాదు కదా…! చిరుద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్న సమయంలో ఈ శ్రీధర్బాబు బాపు శ్రీరాములుతోనూ కలిసి నడిచాం. అందుకేనేమో ఆ బాపు గురించి రాసిన ఈ వాక్యాలు…
‘‘నువ్వు / వెళ్తూ వెళ్తూ / నీ లోపలి గది / తాళాలు ఇచ్చి వెళ్లావు / అప్పటి నుంచి / నేను అపరాధిలా అల్లాడుతున్నాను’’ నన్నూ అపరాధిని చేశాయి. ఓ చోట రాశాను…వెళ్లిపోవడమంటే మిగిలిపోవడమే అని. అలా శ్రీరాములు బిడ్డ శ్రీధర్బాబు కవిత్వంలో మిగిలిపోయారు. బహుశా చాలామంది తండ్రులు ఇలాగే మిగిలిపోయారేమో. ఈ పద్యంలోనే ఇలా కూడా అంటాడు శ్రీధర్ బాబు.
‘‘నువ్వు వెళ్లిపోయిన తర్వాత / నువ్వు లేని ప్రపంచం నుంచి / బయటకు చూస్తున్నానేమో / నీ ప్రపంచం నన్ను నిలువునా ఆవరిస్తోంది’’ ఇదీ అసలుసిసలు నాన్నకు ప్రేమతో కవిత్వం రాయడమంటే. కొందరు తండ్రులంతే వాళ్లు వెళ్లిపోయిన తర్వాత బయట ప్రపంచాన్ని మనకు అప్పగించి వెళ్లిపోతారు. మనం ఆ ప్రపంచంలో ఈద లేక, నాన్న చిటికెన వేలు కానరాక ఇలా ఒంటరిగా మిగిలిపోతామేమో…! సాహిత్యానికి…ముఖ్యంగా కవిత్వానికీ… వయసుకి ఓ లంగరుంటుంది. ఇరవై ఏళ్లలోపు రాసిన కవిత్వంపై మక్కువ ఉంటుంది. ఏమీ తెలియకుండా ఏదైనా రాసేయగలమనే థీమా ఉంటుంది. వయసు మీద పడుతున్న కొద్దీ ఆ తెరలు, భ్రమలు తొలగిపోతాయి. ఒక్కోసారి మనం రాసిన కుర్ర కవిత్వం చదువుకుంటే మక్కువ పోయి ముక్కున వేలేసుకుంటాం సంకల్పితంగానే. ఇదే కవిత్వంలో ఉండే మజా. శ్రీధర్బాబు కూడా దీనికి అతీతుడేం కాదు. అందుకే ఏభై వయసొచ్చాక రాసిన తన కవిత్వం గురించి ఇలా చెప్పాడు… 50 తర్వాత అనే కవితలో …‘‘రాయాల్సింది చాలా ఉందని / ఇన్నేళ్లు రాసిందంతా / అక్కడికి చేరుకోవడానికి / చేసుకున్న బాటేనని తెలుస్తుంది / యాభై ఏళ్ల తర్వాత’’ ఇదీ వయసొచ్చాక అలవరచుకోవాల్సిన తాత్వికత అంటున్నాడు శ్రీధర్బాబు. కవి చుట్టూ ఏదో దిగులు వెంటాడుతూంటేనే ఇలాంటి కవిత్వం వస్తుంది అనిపిస్తుంది. ఆ దిగులుకి అనేకానేక కారణాలుండచ్చు. ఆ కారణాల నుంచే…‘‘ఈ బాటలో ఎందరెందరినో నడిపించి / బాధించి ఉంటానా / క్షమించమని కోరాలని ఓ పరిణితి / యాభై తర్వాత ‘‘ అంటూ తాను రాసిన కవిత్వం గురించి సంజాయిషీ కూడా ఇచ్చుకున్నాడు ఈ ఆధునికానంతర కవి. ఇంచుమించు చలం కూడా ఇలాగే చెప్పుకున్నాడు తన మలి వయసులో. ‘‘ఈ ఎడం భుజమ్మీదకు / ముఖ్యంగా అర్థరాత్రికి కాస్త అటూ ఇటూ / జల జలా పైకి వచ్చి / జివ్వున తిరుగుతూంటాయి’’ అంటున్నాడు తన పునరపి గురించి. ఇదే గాయాన్ని గేయం చేయడమంటే. కవిత్వ రహస్యం తెలిసిన వారే ఇలా రాయగలరు. శ్రీధర్బాబు అదే పని చేశాడు. అచ్చమైన కవి కదా. ఇలాగే చేస్తాడు. నిజమైన కవులు ఇలాగే చేయాలంటున్నాడు తన కొత్త కవిత్వ సంకలనం ఏకాంతం ఒక అతిథిలో. ఈ కవిత్వం చదివితే శుద్ధ కవిత్వం చదివిన తర్వాత వచ్చే అనుభూతి మిగులుతుంది. మంచి కవిత్వం చదవాలనిపిస్తుంది. వినాలనిస్తుంది. ముఖ్యంగా కొన్నేళ్లు బతకాలనిపిస్తుంది.
సీనియర్ జర్నలిస్టు, 99120 19929
వన్నె తగ్గుతున్న శివసేన
దాదాపు దశాబ్దం తరవాత బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్తో సహా మహారాష్ట్రలో మొత్తం 29 మునిసిపల్ కార్పొరేషన్లకు గురువారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ పథంలో సాగిపోతోంది. అంటే బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ మీద శివసేనకు పాతికేళ్ల నుంచి ఉన్న పట్టు సడలి పోయింది. ఏ ప్రాంతీయ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీలు క్రమంగా అదృశ్యం అయిపోతాయి అన్నది గత పన్నెండే ళ్లుగా ఎదురవుతున్న అనుభవం. బృహన్ముంబై వార్షిక బడ్జెట్ హర్యానా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది దాదాపు లక్ష కోట్ల రూపాయలకు చేరబోతోంది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పై శివసేన పట్టు తగ్గడం అంటే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వారసత్వం సైతం ముగింపు దశకు రావడమే. శివసేన చీలిక వర్గం నాయకుడైన ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నారు కనక ఆ వర్గానికి ప్రస్తుతానికి పెద్ద నష్టం కనిపించకపోవచ్చు. కానీ బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేకు, బాల్ ఠాక్రే సోదరుని కుమారుడు రాజ్ ఠాక్రేకు కూడా ఇది కోలుకోలేని దెబ్బే కావచ్చు. ఎందుకంటే ఉద్ధవ్ఠాక్రే ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయక తప్పని పరిస్థితులను బీజేపీ కల్పించింది. తరవాత షిండే వర్గాని కన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలున్నప్పటికీ షిండే ముఖ్యమంత్రి కావడానికి అంగీకరించింది. ఆయన 2022 జూన్ 30 నుంచి 2024 డిసెంబర్ నాలుగు దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. షిండేకు అధికారంలో కొనసాగడం ప్రధానం అయితే బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేనను అంతం చేయడం బీజేపీ లక్ష్యం. గురువారం జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ ఎలా పుంజుకుంటోందో స్పష్టం అవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చివరి క్షణంలో ఐక్యమై బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ మీద పట్టు నిలుపుకోవాలని చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. బాలా సాహెబ్ ఠాక్రే కు ఉన్న ప్రాబల్యం, జనబలం ఉద్ధవ్ ఠాక్రేకు లేవు. బాల్ ఠాక్రే ఇల్లు మాతోశ్రీ నుంచి నడిచే రాజకీయాలకు ఇక అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ శక్తిమంతమైన నాయకుడిగా తయారయ్యారు. ఏక్నాథ్ షిండే బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉండొచ్చు. ఆయన నాయకత్వంలోని శివసేన వర్గం ఇప్పటికీ బలంగా ఉన్నట్టు కనిపించవచ్చు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్, మొత్తంగా బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తే షిండే వర్గం కూడా చరిత్ర గర్భంలో ఇమిడిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు. బృహన్ముంబైతో పాటు నాగపూర్, పుణే మునిసిపల్ కార్పొరేషన్లలోనూ బీజేపీ అపూర్వంగా మూడిరట రెండు వంతుల స్థానాలు సంపాదించి విజయం సాధించబోతోంది. శరద్ పవార్, బాలాసాహెబ్ ఠాక్రే, కాంగ్రెస్ సాంప్రదాయిక రాజకీయాలూ అంతమయ్యే దశకు చేరుకున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసిన వసంత్ రావ్ నాయక్, వై.బి.చవాన్ రికార్డును చేరుకున్నారు. బాలాసాహెబ్ ఠాక్రే సజీవంగా ఉన్నప్పుడు కూడా రాజ్ఠాక్రే రాజకీయాలలో ఎక్కువ రాణించారు. బాల్ఠాక్రే తరవాత రాజ్ఠాక్రేనే శివసేన అధినేత అవుతాడనుకున్నారు. కాని బాల్ఠాక్రే పుత్ర వ్యామోహంతో ఉద్ధవ్ ఠాక్రేకు శివసేన పగ్గాలు దక్కేలా చేశారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే ఎన్నడూ తండ్రి స్థాయికి చేరుకోలేక పోయారు. ఉద్ధవ్ ఠాక్రేకు ఫొటోగ్రఫీ మీద ఉన్న అనురక్తి రాజకీయాల మీద ఉండేది కాదు. బాల్ఠాక్రే స్వభావం ఉద్ధవ్ ఠాక్రేకు వారసత్వంగా అబ్బలేదు. బాల్ఠాక్రే లాగా ఆయన తీవ్ర హిందుత్వ వైఖరిని అనుసరించలేకపోయారు. ఆయన శివసేన సంప్రదాయాన్ని వదిలి సాధారణ రాజకీయ పార్టీగా నడపడం మొదలుపెట్టారు. బాలాసాహెబ్ ఠాక్రేకు ఉన్న జనాకర్షక శక్తి కూడా ఉద్ధవ్ఠాక్రేలో కనిపించదు. ఈ పరిస్థితిని బీజేపీ వాటంగా వినియోగించుకుంది. 2014 తరవాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా రాజకీయాల స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు. ఈ అంశాన్ని ఉద్ధవ్ ఠాక్రే గమనించినట్టు లేదు. శివసేనను చీల్చడం అసాధ్యం అనుకున్న స్థితిలో మోదీ, అమిత్ షా ఆ పార్టీని రెండు ముక్కలు చేయగలిగారు. బీజేపీ అండతో ఏక్నాథ్ షిండే అధికారాన్ని ఆసరాగా చేసుకుని బలమైన నాయకుడిగా ఎదిగారు. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటే కావొచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలను అంతమొందించడమే బీజేపీ అసలు లక్ష్యం.మోదీ, అమిత్ షా రాజకీయాలను నిలవరించడంలో మహారాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలం అవుతూనే ఉన్నాయి. బీజేపీకి అందుబాటులో ఉన్న సకల విధ వనరులు ఏ పార్టీ దగ్గరా లేవు. బీజేపీలాగా లక్ష్యాన్ని సాధించే పట్టుదల కూడా ప్రతిపక్ష పార్టీలకు లేదు. ప్రాంతీయ పార్టీలను అంతం చేయడానికి బీజేపీ పకడ్బందీ వ్యూహం పన్నడంతో పాటు ఎంతకైనా దిగజారగలదు. అవసరం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలతో కత్తు కలపకలదు. ఆ తరవాత ఆ పార్టీల అస్తిత్వానికే ఎసరు పెట్టగలదు. దీనికి కర్నాటకలోని జనతా దళ్ (సెక్యులర్) ఉన్న దుస్థితే ప్రబల నిదర్శనం. అది ఇప్పుడు అవసాన దశలో ఉంది. 2017లో బృహన్ముంబై ఎన్నికలు జరిగినప్పుడు శివసేన ఆధిపత్యం సంపాదించింది. దానికి ప్రధాన కారణం శివసేన అప్పటికి ఐక్యంగా ఉండడం, బీజేపీ అస్తిత్వం నామమాత్రం కావడం కారణం కావొచ్చు. ఉద్ధవ్ఠాక్రేకు, రాజ్ఠాక్రేకు మధ్య సయోధ్య కుదిరినట్టు కనిపిస్తున్నా మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికలలో కలిసి పోటీ చేయలేదు. రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన విడిగానే పోటీ చేసింది. శుక్రవారం సాయంత్రానికి 29 కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడలేదు. కానీ అత్యధిక స్థానాల్లో బీజేపీనే గెలుపు బాటలో ఉంది. ఆ తరవాత షిండే నాయకత్వంలోని శివసేన వర్గం ఉంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య అంతరం చాలాఎక్కువే. పుణేలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని శరద్పవార్ వర్గం, అధికారపక్షంలో చేరిపోయిన పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ వర్గం ఉమ్మడిగా పోటీ చేసినా అంతగా ఫలితం దక్కలేదు. ఇది అపవిత్ర కలయిక అన్న మచ్చ మాత్రం తప్పలేదు. పూర్తి ఫలితాలు వెలువడక పోయినా బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పై బీజేపీ పట్టు సాధించడం ఖాయం అనిపిస్తోంది. అయితే ప్రతిపక్షం విజయం సాధించకపోయినా మరీ కుదేలు కాకపోవడం గమనించదగిన అంశం. శివసేన చేతిలోంచి బృహన్ముంబై జారిపోవడం కన్నా బీజేపీ పట్టు సాధించడం ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం.

