Wednesday, May 14, 2025
Home Blog Page 3

ఘనంగా అయ్యప్ప స్వామి దేవాలయ వేడుకలు..

దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు.. గురుస్వామి విజయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కేశవ నగర్లో నూతనంగా నిర్మాణం అయిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఈనెల 10వ తేదీన నుండి 14వ తేదీ వరకు ఘనంగా దాతలు, అయ్యప్ప భక్తాదులు, పట్టణ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వాహకులు గురుస్వామి విజయ్ కుమార్, కీర్తిశేషులు కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండ్లపల్లి వెంకట జయప్రకాష్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు శనివారం మహాగణపతి పూజ, యాగ సంకల్పం, రక్షాబంధనం, వాస్తు హోమం,సూత్ర వేస్టణం ,అఖండ దీపా స్థాపన అంకురార్పణముతో ప్రారంభం కావడం జరిగింది. తదుపరి మూడవరోజు మహాగణపతి, ఏకాదశ రుద్ర, నవమాన అవాహిత దేవత హోమాలు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ గురు స్వామి విజయకుమార్,అర్చకులు వారి శిష్య బృందం నిర్వహించారు. తదుపరి శివ సహస్రనామ, విష్ణు సహస్రనామ, పుష్పాదివాసము పూర్ణాహుతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా అర్చకులు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి భక్తాదులు అయ్యప్ప స్వామి ఆలపించిన వైనం అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమాలను తిలకించడానికి వందలాదిమంది అయ్యప్ప మాల ధారణ భక్తాదులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బుద్ధుని బోధనలు నేటి మానవాళికి ఆదర్శం..

శ్రీ సత్య సాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం;; బుద్ధుని బోధనలు నేటి మానవాళికి ఆదర్శము అని శ్రీ సత్యసాయి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గాజుల సోమేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గౌతమ బుద్ధుని బోధించిన ప్రేమ, శాంతి ,ధ్యాన మార్గాలలో నేడు మానవులు అనుసరించాల్సిన అవసరం ఉందని, దీనివల్ల కూడా ఎంతో ఉపయోగం ఉందని కూడా తెలిపారు. ధ్యానం అవలంబించడం వలన మానసిక ప్రశాంతి తో పాటు నిగ్రహ శక్తి కూడా పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహాలక్ష్మి అధ్యాపకులు వనిత, సీనియర్ అసిస్టెంట్ మునుస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అనంత జిల్లా సాగునీటి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దరూర్ పుల్లయ్య

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : అనంత జిల్లా సాగునీటి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దరూర్ పుల్లయ్య అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం మాజీ పార్లమెంట్ సభ్యులు దరూర్ పుల్లయ్య పార్థివ దేహాన్ని బళ్లారిలో ఆయన స్వగృహంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ రాష్ట్ర పార్టీ తరపున పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ…. అనంతపురం జిల్లాలో సాగునీటి కోసం పుల్లయ్య అహర్నిశలు కృషి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఆయన అన్ని రాజకీయ పార్టీలను రైతు సంఘాలను సమన్వయం చేసుకొని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయుటకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బళ్లారి జిల్లా యువజన సమాఖ్య అధ్యక్షులు బసప్ప, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌

దాయాది పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం ప‌రామ‌ర్శించారు. ఈరోజు ఉద‌యం బెంగ‌ళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయ‌న శ్రీస‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు. మురళీ నాయక్ త‌ల్లిదండ్రులు శ్రీరామ్ నాయ‌క్‌, జ్యోతిబాయిల‌ను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… ముర‌ళీ నాయ‌క్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆయ‌న అంద‌రికీ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని అన్నారు. ముర‌ళీ నాయ‌క్ చేసిన త్యాగానికి దేశం రుణ‌ప‌డి ఉంటుంద‌న్నారు. వైసీపీ త‌ర‌ఫున వీర జ‌వాన్ కుటుంబానికి రూ. 25ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి త‌మ పార్టీ అన్ని విధాలుగా అండ‌గా ఉంటుందని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న తిరుగు ప‌య‌న‌మ‌య్యారు.

ఇక‌, ఇప్ప‌టికే వీర జ‌వాన్ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. అలాగే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న వ్య‌క్తిగ‌తంగా ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు ఇస్తానని ప్ర‌క‌టించారు.

ఈసారి ముందే… అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు

వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల వద్ద విస్తరించిన రుతుపవనాలు
మే 27 నాటికి కేరళను తాకే అవకాశం

తీవ్రమైన వేసవి తాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి శుభవార్త అందించింది. దేశ వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ, అంచనాల కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో నికోబార్ దీవుల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఇవి మరింతగా విస్తరించి, అండమాన్ నికోబార్ దీవుల మొత్తంతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు చేరుకుంటాయని, ఇందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ నెల 27వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళలోకి ప్రవేశించే నైరుతి, ఈసారి సుమారు నాలుగు రోజుల ముందే రానుండటం గమనార్హం. ఇది సాకారమైతే, 2009 తర్వాత రుతుపవనాలు ఇంత ముందుగా రావడం ఇదే ప్రథమం అవుతుంది. 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.

ఇక, ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుండటం ఊరటనిచ్చే అంశం.

భారతదేశంలో దాదాపు 52 శాతం సాగుభూమి వర్షాధారంగానే ఉంది. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో 40 శాతం ఈ భూముల నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో, దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి నైరుతి రుతుపవనాలే ఆధారం. అంతేకాకుండా, దేశంలోని జలాశయాలు నిండటానికి, తాగునీటి అవసరాలు తీర్చడానికి, విద్యుదుత్పత్తికి, తద్వారా దేశ జీడీపీ వృద్ధికి నైరుతి వర్షాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి.

ఆపరేషన్‌ సిందూర్‌: 11 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఒప్పుకున్న పాకిస్థాన్‌

పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భార‌త్‌ ాఆపరేషన్‌ సిందూర్‌్ణతో దాయాది పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పిన విష‌యం తెలిసిందే. భారత్‌ చేపట్టిన ఈ దాడితో పాక్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఆపరేషన్ సిందూర్‌లో తనకు జరిగిన నష్టాన్ని పాక్‌ తాజాగా వెల్లడించింది. భారత్ చేప‌ట్టిన ఈ ఆప‌రేష‌న్ ద్వారా 11 మంది సైనికులు చ‌నిపోయినట్లు తాజాగా తెలిపింది. మృతుల్లో ఆరుగురు పాక్‌ ఆర్మీకి చెందిన వారు కాగా, ఐదుగురు వైమానికి దళానికి చెందిన వారని వెల్ల‌డించింది. అలాగే మరో 78 మంది గాయపడినట్లు పేర్కొంది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 40 మంది పౌరులు మ‌ర‌ణించ‌గా… 121 మంది గాయపడినట్లు తెలిపింది. ఈమేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్‌పీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. మరణించిన సైనికుల పేర్లను కూడా పాక్‌ వెల్లడించింది. ఆర్మీకి చెందిన నాయక్‌ అబ్దుల్‌ రెహమాన్‌, లాన్స్‌ నాయక్‌ దిలావర్‌ ఖాన్‌, లాన్స్‌ నాయక్‌ ఇక్రముల్లా, నాయక్ వకార్ ఖలీద్, సిపాయ్ ముహమ్మద్ అదీల్ అక్బర్, సిపాయ్ నిసార్ మరణించినట్లు తెలిపింది. అలాగే వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్‌ ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.

అయితే, తమ దాడిలో 35 నుంచి 40 మంది పాక్‌ సైనికులు మృతిచెంది ఉంటారని భారత్‌ ఇటీవలే తెలిపిన విషయం తెలిసిందే. అలాగే 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు.

వ‌ల్ల‌భ‌నేని వంశీ రిమాండ్ పొడిగింపు

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట‌యిన వైసీపీ నేత‌
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట‌యిన వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మ‌ళ్లీ నిరాశేఎదురైంది. ఆయ‌న‌ రిమాండ్‌ను న్యాయ‌స్థానం మ‌రోసారి పొడిగించింది. రేప‌టి వరకు వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజుతో రిమాండ్ ముగియ‌నుండ‌టంతో పోలీసులు ఆయ‌న్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఇరువైపుల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం వంశీ రిమాండ్‌ను రేప‌టి వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో ఆయ‌న‌ను పోలీసులు మ‌ళ్లీ విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించారు.

ఇక‌, ఇదే కేసులో వంశీతో సహా మిగిలిన న‌లుగురు నిందితులు గంటా వీర్రాజు, శివ‌రామ‌కృష్ణ ప్ర‌సాద్‌, నిమ్మ చ‌ల‌ప‌తి, వేల్పూర్ వంశీబాబుల రిమాండ్ కూడా ఇవాళ్టితో ముగియ‌నుండ‌గా పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. వారి రిమాండ్‌ను కూడా న్యాయ‌స్థానం రేప‌టి వ‌ర‌కు పొడిగించింది.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

గాయపడిన మరికొందరు
మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి.. అండగా ఉంటానని హామీ
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

పల్నాడు జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ దారుణం జరిగింది. వినుకొండ మండలం శివాపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బొప్పాయి కాయలతో వెళుతున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. పనుల నిమిత్తం వీరు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గడ్డమీదపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం .. విద్యా సంస్థల్లో నాన్ లోకల్ కోటా‌కు చెల్లు

రాష్ట్రంలోని స్థానికేతర కోటా ఇక పూర్తిగా మనవాళ్లకే
ఇప్పటికే 15 శాతం కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్
తాజాగా ఇక్కడి వర్శిటీల్లో తెలంగాణ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
వృత్తి విద్య, డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటివరకు అమలవుతున్న 15 శాతం స్థానికేతర (నాన్ లోకల్), జనరల్ కోటా సీట్ల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు నాన్ లోకల్ కోటా కింద 15 శాతం సీట్లలో తెలంగాణకు చెందిన వారికి అవకాశం కల్పిస్తుండగా, ఇక నుంచి పూర్తిగా ఏపీ వారికే కేటాయించనున్నారు.

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనల్లో స్థానిక, స్థానికేతరులను స్పష్టం చేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం వేర్వేరుగా మూడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అక్కడి వర్సిటీల్లోని 15 శాతం కోటాలో ఏపీ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు జారీ చేయగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం ఇక్కడి వర్సిటీల్లో తెలంగాణ వారికి అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది. కన్వీనర్ కోటా సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయిస్తారు.

స్థానికత ఏపీలో రెండు రీజియన్లుగా ఉంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లుగా దీన్ని నిర్ణయిస్తారు. ఉమ్మడి ఏపీ, విభజన అనంతరం పదేళ్లపాటు ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర, ఉస్మానియా రీజియన్లుగా సీట్ల భర్తీ చేయగా, ఇప్పుడు ఉస్మానియా రీజియన్‍ను తొలగించారు. ఇక నుంచి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర రీజియన్ల వారీగా మాత్రమే సీట్లను భర్తీ చేయనున్నారు.

జమ్మూకశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కినట్టు తెలిసింది. షోపియాన్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీనితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే కాల్పులు జరిపారు.

ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదే ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకుని ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. వారిని ఉగ్రవాదులను పట్టుకునేందుకు లేదా మట్టుబెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయి.