విశాలాంధ్ర/హైదరాబాద్: ఎల్ వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ (ఎల్వీపీఐఐ) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ‘రీచింగ్ ఔట్ విత్ ఇన్నోవేటివ్ సర్వీసెస్ ఫర్ ఐకేర్ (రైజ్)’ ప్రాజెక్ట్ కింద ఇంటింటికి కంటి పరీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది, దీనికి సీమెన్స్ హెల్తినీర్స్ ఇండియా తన సిఎస్ఆర్ కార్యక్రమం ద్వారా మద్దతును అందిస్తున్నది, ఈ ప్రాజెక్ట్లో భాగంగా మహేశ్వరం మండలంలో 50,000ల మందికి పూర్తి ఉచితంగా కంటి పరీక్షలను చేయనున్నారు. మహేశ్వరంలోని ఎల్విపిఇఐ విజన్ సెంటర్లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.అంధత్వ నివారణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రమైన ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఈ దిశలో ఎంతో అంకితభావంతో కృషి చేస్తున్నది. సార్వజనిక కంటి ఆరోగ్య కవరేజ్ లక్ష్యాలను ‘రైస్’ ప్రాజెక్ట్ నెరవేర్చనున్నది. మహేశ్వరం మండలంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి కంటిపరీక్షా కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరికీ నాణ్యమైన కంటి ఆరోగ్య సంరక్షణా సేవలను అందుబాటులో తీసుకురావడం, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలలో దృష్టి సమస్యలను పరిష్కరించనున్నది. కంటి సమస్యలున్నాయని గుర్తించినవారిని సమగ్ర కంటి పరీక్ష కొరకు మహేశ్వరంలోని ఎల్విపిఇఐ విజన్ సెంటరును (ప్రాధమిక నేత్ర సంరక్షణా కేంద్రం) సందర్శించాలని సిఫార్సు చేస్తారు.