న్యూదిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ డేటాబేస్పై సైబర్ దాడి జరిగింది. కంపెనీ సిస్టమ్స్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత డేటా వివరాలను తస్కరించారు. అయితే, హ్యాకర్స్ ఎంత సమాచారాన్ని సేకరించారనే దానిపై వివరాలను సేకరిస్తున్నామని కంపెనీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ‘టయోటా కిర్లోస్కర్కు అనుబంధంగా పనిచేసే ఓ సంస్థ మా కంపెనీ డేటాబేస్పై సైబర్ దాడి జరిగినట్లు మాకు తెలియజేసింది. ఈ దాడిలో టయోటా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అయినట్లు భావిస్తున్నాం. సైబర్ నేరగాళ్లు ఎంత సమాచారాన్ని సేకరించారు? కంపెనీ సర్వర్లో ఎంత వరకు చేరుకోగలిగారనే దానిపై విచారణ జరుపుతున్నాం’ అని కంపెనీ పేర్కొంది. టయోటో కిర్లోస్కర్ సర్వర్పై దాడి విషయాన్ని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) కూడా ధ్రువీకరించింది. సైబర్దాడి నేపథ్యంలో తమ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేందుకు కంపెనీ నిరంతంర కృషి చేస్తుందని, వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు గతేడాది కార్ల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడిరచింది. 2021లో కంపెనీ మొత్తంగా 1,30, 768 కార్లను విక్రయించగా, 2022లో 22.6 శాతం పెరిగి, 1,60, 352 కార్లు అమ్ముడైనట్లు తెలిపింది. గత పదేళ్లలో టయోటా కిర్లోస్కర్కు ఇదే అత్యుత్తమ రికార్డు అని కంపెనీ చెప్పింది. 2012లో అధికంగా 1,72,241 కార్లను విక్రయించగా, ఆ తర్వాత ఈ ఏడాది నమోదైన గణాంకాలు అత్యుత్తమైనవిగా కంపెనీ పేర్కొంది.