ముంబయి: విప్రో కేర్స్తో కలిసి విప్రో కన్స్యూమర్ కేర్ తమ ఏడవ ఎడిషన్ సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా ఈ స్కాలర్షిప్ను ఛత్తీస్ఘడ్లో సైతం ప్రారంభించనున్నారు. ఉన్నత విద్యనభ్యసించాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు తగిన మద్దతునందించడంలో భాగంగా ఈ స్కాలర్షిప్లను అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 10వ తరగతి నుంచి 12 వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలు/కాలేజీలలో విద్యనభ్యసించిన విద్యార్ధులు ఈ స్కాలర్షిప్లను అందుకోవడానికి అర్హులు. వీరు గుర్తించబడిన సంస్థ అందించే కోర్సులలో కనీసం మూడు సంవత్సరాల వ్యవధి కలిగిన డిగ్రీ కార్యక్రమంలో చేరి ఉండాలని విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్, వైస్ ప్రెసిడెంట్-మార్కెటింగ్ ఎస్ ప్రసన్నరాజ్ తెలిపారు. ఈ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18, 2022 వరకూ తెరిచి ఉంటాయి.