జమ్మూ : బంగారు ఆభరణాలకు తప్పనిసరి హాల్మార్కింగ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బంగారం వర్తకులు ఒక రోజు ఆందోళనలు చేపట్టారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం జమ్మూలోని బంగారం వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని జైన్ బజార్ సమీపం సరాఫా అసోసియేషన్, స్వర్ణకార్ సంఫ్ు అధోక్ జమ్మూ కమిటీలు సంయుక్తంగా శాంతియుత నిరసన తెలిపాయి. నీతి ఆయోగ్ సిఫారసుల పేరుతో బీఐఎస్ హాల్మార్క్ విషయంలో ఏకపక్షం చట్టం చేశారని సరాఫా అసోసియేషన్ అధ్యక్షుడు రామన్ సూరి పేర్కొన్నారు. ప్రత్యేకించి బంగారు ఆభరణాల విషయంలో హాల్మార్కింగ్, అమలు చేయడం చాలా కష్టమని తెలిపారు. ఈ కొత్త నిబంధనలు స్వర్ణకారులకు, వినియోగదారులకు సమస్యాత్మకంగా మారతాయని తెలిపారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండు చేశారు. హాల్మార్క్ విషయంలోని కొత్త నిబంధనలను అమలు చేయడానికి తగిన మౌలిక సదుపాయాలు కూడా లేవని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వ నిబంధనల మేరకే ఆభరణాలను విక్రయిస్తున్నామని, వినియోగదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా లేదని గుర్తు చేశారు. బంగారం స్వచ్చతను నిర్ధారించడంలో హాల్మార్క్ చేయడం మంచిదే అయినా సున్నితమైన ఆభరణాల విషయంలో అది ఆచరణాత్మకం కాదని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సిఫారసులను మరోసారి పరిశీలించాలని కోరారు. బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీకి విజ్ఞప్తి చేశారు.