హైదరాబాద్ : ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి మధ్య క్లాషెస్ వచ్చాయనే సంగతి తెలిసిందే. దీనికి తోడు.. ప్రమాణ స్వీకారానికి మెగా హీరోలెవరికీ ఆహ్వానించకపోవడంతో ఆ వార్తలకి మరింత బలం చేకూరింది. ఇక రీసెంట్గా ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో అతిథిగా హాజరైన పవన్ కళ్యాణ్, మరో అతిథిగా వచ్చిన విష్ణుని కన్నెత్తి చూడలేదని, పన్నెత్తి పలకరించలేదని మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఆ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్, తను మాట్లాడుకున్నామని.. కాకపోతే ప్రోటోకాల్ కోసం స్టేజ్ మీద మాట్లాడడం కుదరలేదని విష్ణు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారనే వార్తను తనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని, పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసమే అలా చేశానని చెప్పారు. అలాగే.. ‘మా’ మనకి తల్లిలాంటిదని, దాన్ని కాపాడమని పవన్ కళ్యాణ్ తనతో అన్నారని విష్ణు తెలిపారు. మొత్తం మీద మెగా ఫ్యామిలీతో తమకు ఎలాంటి గొడవల్లేవని.. మేమందరం ఒకే ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటామని విష్ణు దీంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.