Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కమ్ముల డబుల్ ఛాలెంజ్!

తమిళ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు- తమిళ్ రెండు భాషల్లోనూ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రేర్ కాంబినేషన్ ప్రకటన వెలువడినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల ఎలాంటి కథాంశంతో ధనుష్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. శేఖర్ కమ్ముల అంటే ఎమోషన్.. లవ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో సినిమాలు తీస్తారు. సున్నితమైన ఉద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు. మళ్లీ అలాంటి సక్సెస్ ఫుల్ ఎలిమెంట్ తోనే వస్తారా? లేక యూనిక్ గా వస్తారా? అంటూ ఆరాలు సాగుతున్నాయి. ఇప్పటికే కమ్ముల మద్రాసు రాజధాని పాలనలో కలిసి ఉన్న తెలుగు- తమిళ రాష్ట్రాల కథను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం సాగింది. టూస్టేట్స్ -పాలిటిక్స్ రిలేటెడ్ టాపిక్ అని.. నాటి రోజుల్లో తమిళ- తెలుగు ప్రజల స్నేహం సహా భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించనున్నారనే ప్రచారం గట్టిగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో సరి కొత్త అంశం తెరమీదకు వచ్చింది. శేఖర్ కమ్ముల ఈ సారి ఎమోషన్స్ కంటే.. పొలిటికల్ టచ్ ఉన్న కథాంశంపై ఫోకస్ చేసారని కూడా కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఓ వర్గం మాత్రం పొలిటికల్ కంటెంట్ తోనే రాబోతున్నారని గట్టి వాదన వినిపిస్తోంది. అయితే కమ్ములకు ఇదేమీ కొత్త కాదు. అతడు తెరకెక్కించిన లీడర్ ఇదే తరహా. రానా హీరోగా నేచురల్ పంథాలో లీడర్ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కమర్శియల్ గా సినిమా భారీ సక్సెస్ కానప్పటికీ పరిశ్రమ సహా ప్రేక్షకుల్లో మంచి విజన్ ఉన్న దర్శకుడిగా కమ్ములాకి మంచి పేరొచ్చింది. స్క్రిప్ట్ ని ఆయన రాసుకున్న విధానం.. తెరపైన ఆవిష్కరించిన పద్ధతి విమర్శకుల్ని సైతం ఎంతగానో మెప్పించింది. కానీ కమర్శియల్ ఎలిమెంట్స్ లో లోపం వల్ల వసూళ్ల పరంగా వెనుకబడింది. కానీ ఈసారి పొలిటికల్ స్క్రిప్ట్ ని శేఖర్ కమ్ముల అన్ని విధాలుగా జాగ్రత తీసుకునే అవకాశం ఉంది. మరి రాజకీయ నేపథ్య కథాంశం అయితే మాద్రాస్ ప్రెసిడెన్సీ నాటి పరిస్థితుల్ని ఇన్ బిల్ట్ చేస్తూ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా మలచబోతున్నారా? లేక పూర్తిగా నాటి రాజకీయ అంశాల్నే టచ్ చేస్తారా? అన్నది చూడాలి.

కమ్ముల కంటే ముందే వేరొకటి..?

శేఖర్ కమ్ముల చిత్రానికి ముందే ధనుష్ ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంకా ప్రకటించని ఈ మూవీ షూటింగ్ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం ఎడ్యుకేషన్ మాఫియా చుట్టూ తిరిగే సోషియో పొలిటికల్ డ్రామా.. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక యువకుడు చేసిన పోరాటాన్ని చూపించనున్నారు. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో `డి 43` షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ చిత్రం `అట్రాంగి రే` హాలీవుడ్ చిత్రం `ది గ్రే మ్యాన్` షూటింగ్ లను ధనుష్ పూర్తి చేసాడు. మిత్రన్ జవహర్ దర్శకుడిగా సన్ పిక్చర్స్ బ్యానర్ లోనూ ధనుష్ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే అన్నయ్య సెల్వరాఘవన్ తో కలిసి `నాన్ వరువెన్` కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 20 న ప్రారంభం కానుంది. అలాగే సెల్వ రాఘవన్ తో బ్యాక్ టు బ్యాక్ పని చేస్తాడు. వచ్చే ఏడాది `ఐరథిల్ ఓరువన్ 2` కోసం ఆయన తన సోదరుడు దర్శకుడు సెల్వరాఘవన్ తో పని చేస్తారు. ఇవన్నీ పూర్తి చేసేందుకు మరో రెండు మూడేళ్లు పట్టనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img