హైదరాబాద్ : సృజన దర్శకత్వంలో తెరకెక్కిన ‘గమనం’ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్ర యూనిట్ గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రియ శరన్, ప్రియాంక జవాల్కర్, సాయిమాధవ్ బుర్రా, డైరెక్టర్ సుజన, ప్రొడ్యూసర్ బాబా తదితరులు పాల్గొన్నారు. క్రియా ఫిల్మ్ కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్పై, మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం గురించి సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ.. గమనం చిత్రం చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ కథ చెప్పినప్పుడే ఈ సినిమాకి నాకు మాటలు రాయాలని అనిపించింది. డైరెక్టర్ సృజనగారి గురించి చెప్పాలంటే సినిమా ప్రతి ఫ్రేమ్లో తన తపన కనిపిస్తుంది. ఆమె ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. ఇళయరాజాగారితో స్క్రీన్లో నా పేరు పడటం నా అదృష్టం, శ్రియతో గౌతమిపుత్ర శాతకర్ణి, ఇప్పుడు గమనం చేయటం చాలా సంతోషం. చాలా మంచి నటి. సినిమా చాలా బాగా వచ్చింది మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను.. అని తెలిపారు. దర్శకురాలు సృజన మాట్లాడుతూ.. ఏ కథ చెప్పినా కానీ దానికి ఒక మోరల్ ఉండాలి.. అలాంటి కథనే మా ఈ గమనం అన్నారు. శ్రియ శరన్ మాట్లాడుతూ.. థ్యాంక్యూ సృజన.. గమనం కథ సృజన హార్ట్ నుంచి వచ్చింది. గమనం సినిమాలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్నారు. ఇంకా శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ తమ పాత్రల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.