చెన్నై : దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. అరవింద్ స్వామి, సముద్రఖని వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ మూవీ కరోనా రెండో దశ వ్యాప్తికి ముందే ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల విడుదలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ వినాయకచవితికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ఇపుడు ఈ చిత్రానికి కొత్త సమస్య ఎదురైంది. ‘తలైవి’ విడుదలైన రెండు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలు అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే థియేటర్ యజమానులు లేవనెత్తుతున్నారు. విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్న ‘తలైవి’ చిత్రాన్ని థియేటర్లో ఎందుకు ప్రదర్శించా లంటూ ప్రశ్నిస్తున్నారు. థియేటర్లో విడుదలైన 30 రోజుల తర్వాతే ఓటీటీ లకు ఇవ్వాలనే నిబంధన అమల్లో ఉంది. ఈ నిబంధనకు వ్యతిరేకంగా రెండు వారాల్లోనే ఎలా రిలీజ్ చేస్తారని థియేటర్ యజమానులు ప్రశ్నిస్తున్నారు.