హైదరాబాద్: స్టార్ హీరో పవన్ కల్యాణ్… తమిళంలో విజయవంతమైన సినిమా ‘వినోదయ సితం’ తెలుగు రీమేక్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించ నున్నాడు. ఈ సినిమా చిత్రీకరణకు తాజాగా శ్రీకారం చుట్టారు. మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగులోనూ దర్వకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రబృం దంతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు హీరో సాయిధరమ్ తేజ్. ఆయన స్పందిస్తూ…‘నా జీవితానికి గురువుగా భావించే పవన్ కల్యాణ్ గారితో కలిసి నటించాలనే కల ఈ సినిమాతో తీరుతున్నందుకు ఆనందంగా ఉంది. సెట్స్లో అడుగుపెట్టే రోజు కోసం వేచి చూస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత కాగా వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా కథతో తమిళంలో మంచి విజయాన్ని సాధించిందీ చిత్రం. తెలుగు రీమేక్లో మన నేటివిటీతో పాటు పవన్ ఇమేజ్కు తగినట్లుగా మార్పులు చేసినట్లు సమాచారం. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.