హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వర్షాలు భారీగా పడుతూ ఉండటంతో, షూటింగుకు అంతరాయం కలిగినట్లు తెలిసింది. వర్షాలు తగ్గితేనే పాట చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలిసింది. ఈ పాట కాకుండా మరో పాటతో పాటు, కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించాల్సి ఉండటంతో ముందుగా అనుకున్నట్టుగా, ఈ నెల చివరికి ఈ సినిమా షూటింగు పూర్తికావడం లేదట. ఈ కారణంగా ‘క్రిస్మస్’కి ఈ సినిమా రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.అడవి నేపథ్యంలో నడిచే ఈ చిత్రం కథ .. అనూహ్యమైన మలుపులతో ఆసక్తికరంగా ఉండనుంది. ప్రతి పాట, ప్రతి ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. బోట్ ఫైట్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.