హైదరాబాద్ : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. బన్నీ వాసు, వాసు వర్మతో కలిసి నిర్మిస్తున్న ఆ చిత్రానికి కథానాయిక పూజాహెగ్డే డబ్బింగ్ చెబుతున్నారు. తన సొంత గాత్రంతో ప్రేక్షకులను అలరించ డానికి సిద్థమవుతున్నారు. గతంలో కూడా ఆమె ఓ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. అందమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం పూజా మరింత కష్టపడి స్పష్టంగా తెలుగులో డబ్బింగ్ చెబుతోంది. ఈ చిత్రంలో అఖిల్, పూజాహెగ్డేల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇటీవల విడుదల చేసిన ‘లెహరాయి’ పాటకు అనూహ్య స్పందన లభించిందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే నెల 8న సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది.