హైదరాబాద్: ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధించాలంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని, మంచి కథjైు ఉండి జనాల మనసుల్ని తాకితే చాలని ‘బలగం’ సినిమా నిరూపించింది. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం అందుకుంది. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా బృందం చేసిన కృషికి అంతర్జాతీయంగా ప్రశంసలు, అభినందనలు అందుతున్నాయి. ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన కమెడియన్ వేణు యెల్దండి తాజాగా అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడి అవార్డును వేణు గెలుచుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్లో ఏకంగా నాలుగు అవార్డులు వచ్చాయి.