హైదరాబాద్ : గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమాగా వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్స్లో శ్రీముఖి ఒకరు. ఆ మధ్య ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ ఆ తరువాత టీవీ షోల పైనే దృష్టిపెడుతూ వచ్చింది. చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో ఆమె ఓ ముఖ్యమైన పాత్రను పోషించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. ఇక తాజాగా బాలయ్య 108వ సినిమా కోసం కూడా ఆమెను తీసుకున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండగా, ఆమెకి ఫ్రెండ్ పాత్రలో శ్రీముఖి కనిపించనుందని అంటున్నారు. మొదటి నుంచి చివరివరకూ ఈ పాత్ర తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది.