హైదరాబాద్ : 2022 సంక్రాంతికి బడా సినిమాలన్నీ విడుదలకు సిద్ధమయ్యాయి. జనవరి 7న రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. 12న పవర్ స్టార్ భీమ్లానాయక్, 14న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ ‘సర్కారువారి పాట’ చిత్రం మాత్రం రేసు నుంచి పక్కకి తప్పుకొని ఏప్రిల్ 1కి విడుదలను వాయిదా వేసుకుంది. అయితే పవన్ ‘భీమ్లా నాయక్’ మూవీ కూడా అదే బాటలో పయనిస్తుందని అనుకున్నవారికి షాకిస్తూ .. అదే డేట్లో తమ సినిమా విడుదలవుతుందని సితారా ఎంటర్టైన్ మెంట్స్ ప్రకటించింది. ఇప్పుడు విడుదల చేయకపోతే మళ్లీ సమ్మర్ వరకూ కుదరదని, అందుకే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాను అంతవరకూ ఆపడం కుదరదని నిర్మాతలు పట్టుదలగా ఉన్నారు. అయితే ‘భీమ్లా నాయక్’ సినిమా ఆ టైమ్లో విడుదలవడం వల్ల ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి అది సమస్యగా మారుతుందని దిల్ రాజు భావిస్తున్నారు. దానికి కారణం దిల్ రాజు ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి డిస్ట్రిబ్యూటర్గా వ్యహరిస్తున్నారు. ‘భీమ్లానాయక్’ రేసులో ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాకి థియేటర్స్ సమస్య ఎదురవుతుంది. రెండు సినిమాలకు సరిగ్గా ఐదు రోజులు మాత్రమే గ్యాప్ ఉంటుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి విడుదలైన 5 రోజులకు థియేటర్స్ కోత తప్పదు. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ పై భారీ పెట్టుబడులు పెట్టిన వారికి రికవరీ కష్టమవుతుంది. ‘రాధేశ్యామ్’ వచ్చిన తర్వాత ఎలాగూ థియేటర్స్ కోత ఉంటుంది.
కానీ దానికి రెండు రోజులు ముందుగానే పవన్ సినిమా వల్ల నష్టపోవాలంటే అది కష్టమేనని దిల్ రాజు భావన. అందుకే ‘భీమ్లానాయక్’ విడుదల వాయిదా గురించి దిల్ రాజు ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఎలాగైనా సినిమాను వాయిదా వేయించాలని, ఆ సినిమా తర్వాత ఎప్పుడు వచ్చినా తమ పూర్తి సహకారం ఉంటుందని, కావల్సిన థియేటర్స్ దక్కేలా చేస్తామని, ఇండస్ట్రీ మంచి కోసం వాయిదాకి ఒప్పుకోవాలని దిల్ రాజు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.