హైదరాబాద్: అందరికీ నిర్మాతగానే తెలిసిన బండ్ల గణేశ్… ఒకప్పుడు హాస్యనటులలో ఒకరిగా చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళ్లారు. ఆ తరువాత కాలంలో నిర్మాతగా మారారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే స్థాయికి చేరుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న బండ్ల గణేశ్, కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి బండ్ల గణేశ్ త్వరలో నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిర్మాతగా బండ్ల కెరియర్ మొదలైంది రవితేజ సినిమా ‘ఆంజనేయులు’తోనే. అక్కడి నుంచే ఆయన నిర్మాతగా ఎదుగుతూ వెళ్లారు. ఆ సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకున్నాడో లేదో తెలియదుగానీ, మళ్లీ రవితేజతోనే సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని టాక్. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ ఉండటం వలన, మళ్లీ అదే కాంబినేషన్ను బండ్ల సెట్ చేస్తున్నారని అంటున్నారు.