హీరో అక్కినేని అఖిల్
విశాలాంధ్ర – రాజానగరం: చరిత్రాత్మక నగరమైన రాజ మహేంద్రవరంతో తమ కుటుం బానికి ప్రత్యేక అనుబంధం ఉందని సినీ హీరో అక్కినేని అఖిల్ అన్నారు. ఏజెంట్ చిత్రం ట్రీజర్ కోసం హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్లేందుకు ప్రత్యేక విమానంలో మంగళవారం మధురుపూడి విమానాశ్రయం విచ్చేసిన అఖిల్ మీడియాతో మాట్లాడుతూ తమ తాత అక్కినేని నాగేశ్వరరావు నుండి తన వరకు తూర్పుగోదావరి జిల్లా వచ్చిన ప్రతిసారీ రాజమహేంద్రికి చెందిన అభిమానులు, ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారన్నారు. ఏజెంట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. గత చిత్రాల కంటే ఏజెంట్ మూవీ కోసం చాలా కష్టపడ్డామని, సినిమా చాలా చక్కగా వచ్చిందని చెప్పారు. ఏజెంట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న భారీ అంచనాలతో విడుదల అవుతుందన్నారు. తమ చిత్రాన్ని ప్రతిఒక్కరు చూసి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. అనంతరం కాకినాడకు అభిమానులతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. మార్గమధ్యంలో కళాశాల విద్యార్థులు, అభిమానులు, మహిళలు అఖిల్ను చూసి, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగపడ్డారు. అఖిల్ వెంట రాజమహేంద్రవరం అక్కినేని అభిమానుల సంఘం అధ్యక్షుడు కాటం రజనీకాంత్, జిల్లా ఇంతజ్ సినీ డిస్ట్రిబ్యూటర్స్, యర్రగుంట శివప్రసాద్, యర్రగుంట దుష్యంత్, సీనియర్ అక్కినేని అభిమానులు రాజకుమార్, సన్నీ డిఎల్, కాటం సంజయ్ కాంత్, సినీ దర్శకులు నాగేంద్ర రెంటాల, సుజిత్, నాని తదితరులు పాల్గొన్నారు.