హైదరాబాద్ : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ హీరోగా.. దేవకట్టా దర్శకత్వంలో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘రిపబ్లిక్’. జెబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించి.. గతంలో విడుదలైన టీజర్, సింగిల్ .. సినిమా మీద అంచనాల్ని పెంచాయి. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రిపబ్లిక్ సినిమా.. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకొని విడుదల తేదీని కూడా లాక్ చేసుకుంది. ఈ సినిమాకి యూ / ఏ సర్టిఫికెట్ ను ఇష్యూ చేయగా.. సినిమాని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ అనంతరం ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో థియేటర్ లో సందడిచేసిన సాయిధరమ్ తేజ.. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత ‘రిపబ్లిక్’ తో మళ్లీ థియేటర్ రిలీజ్ కే ప్రిఫరెన్స్ నివ్వడం విశేషాన్ని సంతరించుకుంది. నిజానికి రిపబ్లిక్ ను ఓటీటీ లో విడుదల చేస్తున్నారంటూ.. వార్తలొచ్చాయి. అయితే రిలీజ్ డేట్ ప్రకటనతో మేకర్స్ ఆ వార్తలకు చెక్ పెట్టినట్టయింది.