హైదరాబాద్ : గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం హిట్ టాక్తో చక్కని వసూళ్లు రాబడుతోంది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో సుహాస్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సోమవారం మహేశ్బాబు వీక్షించి సినిమా ఎంతో నచ్చిందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు కూడా. అయితే కేవలం మహిళల కోసం తెలుగు రాష్ట్రాల్లో 38 థియేటర్లలో బుధవారం, ఫిబ్రవరి 8న ఉచిత షోలు వేయనున్నట్లు చిత్ర నిర్మాతలు మంగళవారం ప్రకటించారు. ఆసక్తికర విషయం ఏంటంటే మహిళలంతా ఉచితంగా సినిమా చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబందించిన టికెట్ను యాంకర్ సుమ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ… ‘దాదాపు 39 థియేటర్స్లో నాలుగు షోలను మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నాం. 39 థియేటర్స్లో నాలుగు షోలు కలిపి దాదాపు 70 వేల మంది ప్రేక్షకులు సినిమా చూసే అవకాశం ఉంది. 70 వేల ఫ్యామిలీస్తో రేపు మీటింగ్ జరగబోతుంది. దీని కోసం కోటి రూపాయిలు పెడుతున్నాం. ఎక్కువ మంది మహిళా ప్రేక్షకులు చూడాలనేది మా ఉద్దేశం. గీత ఆర్ట్స్ వారికి ఈ ఆలోచన చెప్పగానే ఎంతోగానో సపోర్ట్ చేశారు. పాసులు ప్రింట్ చేసి ఎంపిక చేసిన థియేటర్స్ పంపించాం. మహిళలకు కౌంటర్ వద్ద ఉచిత పాసులు ఇస్తారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి వస్తే … భార్య ఉచితంగా సినిమా చూస్తారు, భర్త టికెట్ కొనుక్కుంటారు. ఇదే మా స్వీట్ సర్ప్రైజ్ ఫర్ విమన్. దయచేసి బుధవారం మహిళలు అందరూ వచ్చి సినిమా చూసి ఓ గొప్ప స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తున్నాము. మహిళలు తప్పకుండా చూడాల్సిన సినిమా రైటర్ పద్మభూషణ్’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు, గౌరి ప్రియారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి.