హైదరాబాద్ : నాని తాజా చిత్రంగా వచ్చిన ‘టక్ జగదీశ్’ మంచి రెస్పాన్స్ను రాబట్టుకుంది. ఆయన తదుపరి సినిమా అయిన ‘శ్యామ్ సింగ రాయ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్న ‘అంటే సుందరానికీ!’ సెట్స్పై ఉంది. ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి నజ్రియా నజీమ్ కథానాయికగా పరిచయమవుతోంది. ఆ తరువాత సినిమాను శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో నాని చేయనున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఇటీవల నానీకి ఒక కథను వినిపించాడట. కథ బాగుండటంతో వెంటనే నాని ఓకే చెప్పాడని అంటున్నారు. తెలంగాణ నేపథ్యంలోని ప్రేమకథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మించనున్న ఈ సినిమాకి ‘దసరా’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. ఈ దసరాకి ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.