జమ్మూ-కశ్మీర్ ఎన్నికలలో అక్కడి ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పి.డి.పి.) మధ్య ఎన్నికల పొత్తు కుదరక పోయినా బీజేపీని ఓటమి భయం పీడిస్తోంది. 2019 ఆగస్టు అయిదున 370 వ అధికరణాన్ని రద్దు చేయడంతో సహా జమ్మూ-కశ్మీర్కు ఉన్న రాష్ట్ర ప్రతిపత్తి లాగేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అలాగే లడాఖ్ను విడిగా కేంద్ర పాలిత ప్రాంతం చేసేశారు. అయితే లడాఖ్కు శాసన సభ ఉండదు. జమ్మూ-కశ్మీర్కు మాత్రం ఉంటుంది. 370వ అధికరణం కారణంగానే జమ్మూ-కశ్మీర్లో కల్లోల పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎప్పటి నుంచో వాదిస్తోంది. నిజానికి ఇది బీజేపీకి పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్ు రోజుల నాటి నుంచి సంఫ్ు పరివార్ చేస్తున్న వాదన. 370వ అధికరణం రద్దు చేసిన తరవాత కూడా జమ్మూ-కశ్మీర్లో తీవ్రవాద కార్యకలా పాలు గణనీయంగా తగ్గిన జాడలేవీ లేవు. పైగా తీవ్రవాద కార్యకలాపాలు జమ్మూ ప్రాంతానికి విస్తరిం చాయి. ఈ పరిణామాల వల్ల అక్కడి ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం బీజేపీకి పట్టుకుంది. జమ్మూ-కశ్మీర్లో తొలి దశ ఎన్నికలు గత 18వ తేదీన ముగిశాయి. 25న రెండో దశ పోలింగ్, అక్టోబర్ ఒకటిన మూడో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. మొదటి దశ పోలింగ్ ముగిసిన తరవాత వాతావరణాన్ని గమనిస్తే బీజేపీకి ఉత్సాహకరమైన సూచనలేవీ లేవు. అందువల్ల మొదటి దశ పోలింగ్ ముగిసిన తరవాత ప్రధానమంత్రి మోదీ ఎన్నికల ప్రచార ప్రసంగాలలో పాత బాణీనే ఎత్తుకున్నారు. జమ్మూ-కశ్మీర్లోని మూడు వంశపారంపర్య పాలక కుటుంబాలు జమ్మూ-కశ్మీర్ను కుదేలు చేశాయని మోదీ ఆరోపిం చారు. ఆయన విమర్శ ఫరూఖ్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్. పి.డి.పి. ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ 370వ అధికరణంపై పాకిస్థాన్ అనుసరించే వైఖరినే అనుసరిస్తున్నాయని మోదీ దెప్పి పొడిచారు. ఈ మూడు వంశపారంపర్య పాలక కుటుంబాలు ఏదో ఒక రకంగా అధికారంలోకి వచ్చి మళ్లీ ఆ ప్రాంతాన్ని లూటీ చేయాలని ప్రయత్నిస్తున్నాయి అన్న మాటల్లో అక్కసును సులభంగానే అర్థం చేసుకోవచ్చు. జమ్మూ-కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, 370వ అధికరణాన్ని రద్దు చేస్తే వాతావరణం తమకు అనుకూలంగా మారుతుందన్న బీజేపీ ఆశలు వమ్ము అయినాయి. అందువల్ల మోదీ యథావిధిగా తిట్లకు లంకించుకున్నారు. గత అయిదేళ్ల కాలంలో జమ్మూ-కశ్మీర్ ప్రజల జీవన స్థితిగతులు మారిన దాఖలాలు ఏ మాత్రం లేవు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల తమకు ఒరిగింది ఏమీ లేదన్న అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పైగా గత అయిదేళ్ల నుంచి తమకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందన్న భావన జనంలో తీవ్రంగా ఉంది. జమ్మూ-కశ్మీర్లో గణనీయమైన అస్తిత్వం ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పి.డి.పి. మధ్య ఎన్నికల పొత్తు సాధ్యమై ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ పొత్తు కుదరక పోవడంవల్ల బీజేపీ అవకాశాలు ఇనుమడిరచిన ఛాయలూ లేవు. ఇది మోదీ, అమిత్ షాను చాలా కలవర పరుస్తోంది.
ఇటీవలి లోక్సభ ఎన్నికలలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు సాధ్యమైంది. కశ్మీర్లోని మూడు లోక్సభ స్థానాలైన శ్రీనగర్, బారాముల్లా, అనంత్ నాగ్-రాజౌరి పరిధిలోని 54 నియోజకవర్గాలు ఉంటే 34 నియోజకవర్గాలలో నేషనల్ కాన్ఫరెన్స్ బలం పుంజుకుంది. ఈ మూడు చోట్ల పోటీ చేయకూడదని కాంగ్రెస్, బీజేపీ నిర్ణయించుకోవడం కూడా నేషనల్ కాన్ఫరెన్స్ బలం పుంజుకున్నట్టు కనిపించడానికి కారణం అయి ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్ ఉద్ధంపూర్, జమ్మూ లోక్ సభ నియోజక వర్గాల మీదే దృష్టి కేంద్రీకరించాయి. లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఈ రెండు లోకసభ స్థానాలలోని 29 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అగ్రగామిగా నిలిస్తే కాంగ్రెస్ ఏడు స్థానాల్లో ముందంజలో నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ , కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు లేదన్న మాట నిజమే అయినా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పీర్ పంజాల్, చీనాబ్ లోయలోని 11 సీట్లలో ఈ రెండు పార్టీల మధ్య ఒక అవగాహన ఉంది. ఈ రెండు ప్రాంతాలలో నేెషనల్ కాన్ఫరెన్స్ బీజేపీతో నేరుగా తలపడుతోంది. మిగత చోట్ల బీజేపీకి, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ ఉంది. మొత్తం మీద బీజేపీకి విజయావకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రధానమైన మిగతా మూడు పార్టీల మధ్య పొత్తు లేకపోయినా ఈ మూడూ కలిసి బీజేపీకన్నా ఎక్కువ సీట్లు సంపాదిం చగలిగితే ఈ పక్షాలే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అవకాశాలు సన్నగిల్లుతున్న దశలో మోదీ దూషణలకు ప్రాతినిధ్యం ఇస్తుండగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం మోదీ కీర్తి గానంలో మునిగి తేలుతున్నారు. సరిహద్దు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న అమిత్ షా సరిహద్దు ఆవలి నుంచి తీవ్రవాద దాడులు ఆగిపోయాయని చెప్పడంతో పాటు మోదీ అంటే పాకిస్థాన్కు భయం అని చెప్తున్నారు. సరిహద్దు రేఖకు దగ్గర్లోని అయిదు అసెంబ్లీ స్థానాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా అధీన రేఖ వద్ద మోదీ శాంతి నెలకొల్పారని కీర్తించారు. ‘‘భారత దళాల మీద ఒక్క బుల్లెట్ పేల్చినా తాము పాకిస్థాన్ మీద శతఘ్నులతో సమాధానం చెప్తామని షా హెచ్చరిం చారు. రెండవ దశ పోలింగ్కు ముందు గంభీరంగా కనిపించడం కోసమే మోదీ, షా స్థానిక పార్టీల మీద, కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తున్నట్టు రుజువు అవుతూనే ఉంది. జమ్మూ-కశ్మీర్ లో అధికారంలో ఉన్న మూడు కుటుంబాలవల్లే తీవ్రవాదులు చెలరేగిపోయారని అమిత్ షా అడ్డంగా వాదిస్తున్నారు. తీవ్రవాదంవల్ల ఆ ప్రాంతంలో 40వేల మంది ప్రాణాలు అర్పించవలసి వచ్చిందని కూడా షా అంటున్నారు. కానీ గత అయిదేళ్లలో ప్రశాంతత నెలకొన్న దాఖలాలే లేవు. దీనికి అమిత్ షా దగ్గర సమాధానం లేదు. షా కేంద్ర హోం మంత్రి కనక ఈ మాత్రం గట్టిగా మాట్లాడడాన్ని అర్థం చేసుకోగలం కానీ మోదీని చూసి పాకిస్థాన్ భయపడుతున్నట్టయితే తీవ్రవాద కార్యకలాపాలు పూర్తిగా ఆగి పోయి ఉండాలిగా! ఆ ఛాయలే లేవు. అడపాదడపా తీవ్రవాదులు విజృంభిస్తూనే ఉన్నారు. జమ్మూ-కశ్మీర్ లో పరిస్థితి గురించిన సమాచారం బయటికి పొక్కకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసినందువల్ల వాస్తవ పరిస్థితి ఏమిటో బయటకు రావడం లేదు. తీవ్రవాదం ఆగిపోయిందని చెప్పడం మాత్రం బూటకమే. 370వ అధికరణం రద్దు చేస్తే జమ్మూ-కశ్మీకు ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు సమకూరుతాయని అమిత్ షా అయిదేళ్ల కిందటి నుంచి చెప్తున్నారు. కానీ పెట్టుబడులు సమకూరుతున్న ఆనవాళ్లే లేవు. మోదీ కీర్తి గానంతో తీవ్రవాదం ఆగదన్నది మాత్రం సత్యం.