Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిబద్ద న్యాయవ్యవస్థే అసలు లక్ష్యం

చాలా సందర్భాలలో ప్రధానమంత్రి తన నోటితో చెప్పకూడదనుకున్న మాటలను ఇతర మంత్రుల నోటివెంట పలికిస్తుంటారు. లేదా తన పార్టీ నాయకులకు ఈ బాధ్యత అప్పగిస్తుంటారు. ఎన్నికలలో విజయపరంపర ద్వారా కేంద్రంలో అయితే సంపూర్ణంగానూ, అనేక రాష్ట్రాలలోనూ బీజేపీ పాలన కొనసాగుతోంది. పార్లమెంటులో బీజేపీకి తిరుగులేని మెజారిటీ ఉంది. ప్రతిపక్ష నాయకుల నోరు సునాయాసంగా మూయించ గలుగుతున్నారు. అది వీలు కానప్పుడు ప్రతిపక్షనేతల మైక్‌లు మూగవోయేట్టు చేస్తున్నారు. ప్రభుత్వంమీద మోదీకి ఉన్న పట్టు అద్వితీయమైంది. ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఇష్టానుసారం నడుచుకోవలసిందే. ఆయన మంత్రివర్గ సభ్యుల్లో నలుగురైదుగురు మంత్రులపేర్లు తప్ప మిగతా వారెవరినీ జనం గుర్తుపట్టే స్థితి కూడా లేదు. కానీ రాజ్యవ్యవస్థలో మూడు ప్రధానాంగాలలో కార్యనిర్వాహక వర్గం, చట్టసభలపై మోదీ ఆధిపత్యం కొనసాగుతున్నా న్యాయవ్యవస్థ అనేక సందర్భాలలో ప్రభుత్వాన్ని సంతృప్తిపరిచే తీర్పులు ఇస్తున్నప్పటికీ సంపూర్ణంగా ఆయనకు అనుకూలంగా లేదు. అందువల్ల న్యాయవ్యవస్థను లొంగదీసేపనిలో మోదీ నిమగ్నమై ఉన్నారు. అందుకే ప్రస్తుత న్యాయశాఖమంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవలి కాలంలో పదేపదే న్యాయవ్యవస్థ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికితోడు దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు జరగాలంటున్నారు. ఎన్నికల నిర్వహణ ఆర్థికంగా భారం అయిపోతోందని అందువల్ల ఏకకాలంలో ఎన్నికల నిర్వహణే మంచిదంటున్నారు. ఈ మాట మొదట విన్నది మోదీ నోటి నుంచే. మోదీ పల్లవినే ఇప్పుడు రిజిజు గట్టిగా వినిపిస్తున్నారు. రవిశంకర్‌ ప్రసాద్‌ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ధోరణి కూడా ఇలాగే ఉండేది. న్యాయమూర్తుల నియామకానికి 1993 నుంచి కొలీజియం వ్యవస్థ అమలులో ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన మరో నలుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం న్యాయమూర్తులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వానికి ఓ జాబితా పంపుతుంది. దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తేనే న్యాయమూర్తుల నియామకం సాగుతుంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కూడా ఇదే రీతిలో సాగుతుంది. కానీ కొలీజియం సిఫార్సులను చాలా సందర్భాలలో ప్రభుత్వం తొక్కి పెడ్తోంది. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు 256మంది న్యాయమూర్తుల నియామకానికి జాబితా పంపితే ప్రభుత్వం 148 మంది విషయంలో ఎటూ తేల్చలేదు. న్యాయస్థానాల్లో ఉన్న ఖాళీల కారణంగా పేరుకుపోతున్న కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇటీవలే సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తి నియామకంకోసం సిఫార్సు చేస్తే ప్రభుత్వం నుంచి కదలికేలేదు. సుప్రీంకోర్టు పంపిన న్యాయమూర్తుల జాబితా మీద కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ సిఫార్సుచేసిన వ్యక్తుల గురించి సకలవిషయాలు తెలుసుకునే వెసులుబాటు, బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం మౌనముద్ర దాల్చడంవల్ల ఇప్పటికే నత్తనడక నడుస్తున్న న్యాయం మరింత మందగమనానికి చోటిచ్చినట్టు అవుతోంది. ఏ సిఫార్సుమీద అయినా ప్రభుత్వం నికరంగా అభ్యంతరం వ్యక్తంచేసిన సందర్భమే లేదు. కొలీజియం వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం చొరవ తీసుకున్న ఉదంతమే లేదు. న్యాయవ్యవస్థను ఇరుకున పెట్టడంలో కిరణ్‌ రిజిజుకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షులు జగ్దీప్‌ ధన్కర్‌్‌ కూడా తోడయ్యారు. ఆయన గత నెల ఏడో తేదీన రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరించిన మొదటిరోజే సుప్రీంకోర్టుమీద ధ్వజం ఎత్తారు. రాజ్యసభ ఉపాధ్యక్ష స్థానంలోకి వచ్చినవారు మొదటి రోజు ప్రసంగం చేయడం ఆనవాయితీ. దీనికి కొన్ని విధివిధానాలున్నాయి. సభా వ్యవహారాలు, ప్రభుత్వ నిర్వహణలాంటి వాటి గురించి మాట్లాడడం సంప్రదాయం. కానీ ధన్కర్‌ వీటిని పట్టించుకోకుండా సుప్రీంకోర్టుమీద విమర్శలకు దిగారు. హఠాత్తుగా 2015లో న్యాయమూర్తుల నియామకానికి ఉభయసభలు ఏకాభిప్రాయంతో ఆమోదించిన జాతీయ న్యాయమూర్తుల నియామకచట్టం గురించి మాట్లాడారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు కూడా ఆమోదించినా, బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంకూడా లభించినా సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇది పార్లమెంటును, పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్న ప్రజలను అవమానించడమేనన్నారు. విస్తృత ఆమోదంపొందిన 99వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం బేసబబు అన్నారు. మూడిరట రెండువంతుల రాష్ట్రాలను ఈచట్టాన్ని సమ్మతించాయని కూడా ధన్‌కర్‌ గుర్తుచేశారు. ఇదంతా నిజమే. ఈ లెక్కన ప్రభుత్వం ఏ చట్టం చేసినా సుప్రీంకోర్టు దాన్ని రాజ్యాంగదృష్టితో నిశితంగా పరిశీలించే అవకాశమేలేకుండా పోవాలన్న మాట. చట్టాలను రాజ్యాంగదృష్టితో నిశితంగా పరిశీలించే బాధ్యతఉన్న సుప్రీంకోర్టు మిన్నకుండిపోవాలని ఆయన ఉద్దేశం కాబోలు. పైగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదంటున్నారాయన. ప్రజాభిప్రాయాన్ని మన్నించకపోవడ మేనని కూడా అన్నారు.
కొలీజియం వ్యవస్థలో లోపాలు లేవని కాదు. న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం చేసిన సిఫార్సులన్నింటినీ ఆమోదించడం ఎలా సాధ్యం అని రిజిజు అంటున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం అభ్యంతరాలు తెలియజేసి ఉండొచ్చు. అలాంటి సందర్భమేలేదు. కేవలం ఆ సిఫార్సులను తొక్కి పెట్టడం అంటే అర్థం ఏమిటో! టి.ఎస్‌. ఠాకూర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒక్క న్యాయమూర్తి నియామకాన్నైనా ప్రభుత్వం ఆమోదించలేదు. న్యాయస్థానాల్లో జడ్జీల ఖాళీలు భర్తీ చేయనందుకు ఆయన ప్రధాని మోదీ సమక్షంలోనే కంటతడి పెట్టుకున్నారు. నియామకాలు ఆయన సొంత వ్యవహారమేమీ కాదు మరి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్‌ కిషన్‌కౌల్‌ కొలీజియంమీద నిరసనలను నిండు కోర్టులో తప్పుబట్టారు. అనేకమంది న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు కూడా కొలీజియంను అవహేళన చేయడాన్ని విమర్శించారు. లోపాలతో నిమిత్తంలేకుండా అమలుఉన్న విధానమే అది కనక ప్రభుత్వం నియామకాలకు మోకాలు అడ్డడం అసంబద్దం. సూచనలు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. అవసరం అనుకుంటే జాతీయ న్యాయమూర్తుల నియామక చట్టాన్ని కొత్త రూపంలో మళ్లీ తీసుకొచ్చే అధికారమూ ప్రభుత్వ పక్షానికి ఉన్నప్పుడు నోరు పారేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఘర్షణపడే ఉద్దేశంతో, న్యాయవ్యవస్థను లొంగదీసే ఉద్దేశంతోనే ఈ వాదోపవాదాలు జరగడం అన్యాయం. కొలీజియం సిఫార్సులను ఆమోదించడానికి, ఆమోదించకపోవడానికి గడువు ఏదీ లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధానమంత్రి న్యాయమూర్తుల నియామకం అంశంతో ఓ ఆట ఆడుకున్న పరిస్థితి పర్యవసానంగానే కొలీజియం వ్యవస్థ అమలులోకి వచ్చింది. మోదీ సర్కారు అసలు లక్ష్యం నిబద్ధన్యాయవ్యవస్థ ఉండాలనే. ఇందిరా గాంధీ ఉద్దేశమూ అదే. నియంతృత్వ పోకడల్లో మాత్రం మోదీకి ఇందిరా గాంధీయే ఆదర్శం అనుకోవాలి. ఇక పార్లమెంటుకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో ఉన్న సాధక బాధకాలు మోదీకి గానీ, రిజిజుకు గానీ తెలియక కాదు. ఆధిపత్య ధోరణితోనే ఈ వాదన తీసుకొస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img