Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

న్యాయమూర్తులకు బెదిరింపులు

మొదట సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని దారి మళ్లించిందన్నారు. ఆ తరవాత న్యాయమూర్తులు ఎన్నికలలో గెలవాల్సిన అవసరం లేదు కదా అన్నారు. ఇప్పుడు పదవీ విరమణ చేసిన తర్వాత న్యాయమూర్తులు క్రియాశీల సామాజిక కార్యకర్తలుగా వ్యవహరిస్తే వారివిషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది అంటున్నారు. అంటే పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులు క్రియా శీలంగా ఉంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ ఉంటే వారి మీద కూడా ప్రతిపక్ష నాయకులమీద ప్రయోగించినట్టే సీబీఐ, ఆదాయపు పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ను ప్రయోగించక తప్పదని చెప్పకనే చెప్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని తప్పుబట్టే మాజీ న్యాయమూర్తులకూ వేధింపులు తప్పవని, వారిని ప్రభుత్వం వెంటాడు తుందని మోదీ ప్రభుత్వం నిర్మొహమాటంగా చెప్పదలచుకుంది. ఇది ప్రస్తుతం పదవిలోఉన్న న్యాయమూర్తులకు కూడా ఓ హెచ్చరిక లాంటిదే. ‘‘మీరు కనక ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఇస్తూపోతే పదవీవిరమణ తరవాత మీకూ వేధింపులు తప్పవు’’ అని బాహాటంగానే హెచ్చరిస్తున్నారన్న మాట. ఈ హెచ్చరిక జారీ చేసింది న్యాయవ్యవస్థతో నిరంతరం జగడం పెట్టు కుంటున్న కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్‌ రిజిజు. న్యాయ వ్యవస్థను తమఅధీనంలో ఉంచుకోవాలని మోదీ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. అందుకని న్యాయవ్యవస్థ మీద పదే పదే కిరణ్‌ రిజిజు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన మొదట కొలీజియం వ్యవస్థను తప్పు పట్టారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ఎవరిని న్యాయమూర్తులుగా నియమించాలో కొలీజియం సిఫార్సుచేసే మాట నిజమే. కానీ అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. కొలీజియంలో నలుగురో అయిదుగురో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయ మూర్తులు ఉండొచ్చు. కాని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరినైనా నియ మించాలంటే కొలీజియం సభ్యులు సదరు అభ్యర్థి ఏ రాష్ట్ర హైకోర్టు పరిధిలోకి వస్తారో ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినీ సంప్రదిస్తారు. హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడూ ఇలాగే సంప్రదింపులు జరుగుతాయి. అంతిమంగా కొలీజియం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించవలసి ఉంటుంది. అనేకసందర్భాలలో కొలీజియం సిఫార్సులను ఆమోదించకుండా నెలలతరబడి పక్కనపెట్టి తాత్సారంచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అవసరం అనుకుంటే కొలీజియం సిఫార్సులను వెనక్కుతిప్పి పంపవచ్చు. అప్పుడు కొలీజియం తమ సిఫార్సులను మరోసారి బేరీజు వేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాలలో అలా తిప్పిపంపకుండా మిన్నకుండిపోతుంది. ఆమోదించకుండా కూర్చుంటుంది. దీనివల్ల రెండు ఇబ్బందులు ఉన్నాయి. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత ఏర్పడుతుంది. అలాగే నెలల తరబడి తాత్సారంచేసి ప్రభుత్వం కొలీజియం సిఫార్సులను ఆమోదించినా నియమితుడయ్యే ఆ న్యాయ మూర్తి సీనియార్టీ దెబ్బతింటుంది. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం చేజారి పోవచ్చు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ అనుకూలు న్యాయమూర్తులయ్యే అవకాశం లేకపోవడం ప్రభుత్వాన్ని కలవర పరుస్తోంది. ఇలాంటి పద్ధతి ఏ దేశంలోనూ లేని మాట వాస్తవమే. కానీ మన దేశంలో కొలీజియం వ్యవస్థ అమలులోకి రావడానికి పూర్తి బాధ్యత సుప్రీంకోర్టుదే కాదు. ఎమర్జెన్సీ సమయంలో న్యాయమూర్తుల సీనియారిటీని పట్టించుకోకుండా అప్పటి ప్రధాని తనకు అనువైన వారిని ప్రధాన న్యాయమూర్తులుగా నియమించింది. ఆ రోజుల్లో నిబద్ధ న్యాయవ్యవస్థ అన్నమాట తరచుగా వినిపించేది. ప్రభుత్వం తమకు అనుకూలమైన న్యాయమూర్తులను నియమించడం అంటే న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని, నిష్పాక్షికతను దెబ్బ తీయడమే. ఈ క్రమంలోనే కొలీజియం వ్యవస్థ రూపుదిద్దుకుంది. అనేకమంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కొలీజియం వ్యవస్థను సమర్థించారు. ఇప్పుడున్న చట్టంప్రకారమే కొలీజియం పనిచేస్తోందని చెప్పారు. 

ఏ వ్యవస్థా నూటికి నూరుపాళ్లు లోపరహితమైంది కాకపోవచ్చు. కొలీజియంలోకూడా మార్పులు అవసరంకావొచ్చు. చట్టాన్ని సవరించే హక్కు పార్లమెంటుదే తప్ప సుప్రీంకోర్టుదికాదు. 2015లో అలాంటి ప్రయత్నం జరిగింది. పార్లమెంటు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేశారు. కానీ సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని కొట్టేసింది. ఆ స్థితిలో ప్రభుత్వం లోపరహితంగా మరో చట్టం తీసుకురావచ్చు. కానీ ఇంతవరకు ఆపని చేయలేదు. అలాంటి ఉద్దేశం ఉందోలేదో కూడా చెప్పడంలేదు. కానీ కొలీజియం వ్యవస్థమీద అనునిత్యం విమర్శలు గుప్పిస్తూనేఉంది. ఈ విమర్శలు గుప్పించే బాధ్యత న్యాయశాఖమంత్రి కిరణ్‌ రిజిజుకు అప్పగించి నట్టున్నారు. ఆయన వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా, మర్యాద తప్పినట్టుగాఉన్నా ప్రభుత్వపక్షం నుంచి ఎవరూ సంజాయిషీ కానీ, సవరణకానీ ఇవ్వలేదు. అంటే కిరణ్‌ రిజిజు వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయాలు కావని తేలిపోతోంది. ఇటీవల ఇండియాటుడే ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన కిరణ్‌ రిజిజు మళ్లీ పాత విమర్శలకే కొత్త మసాలా జోడిరచారు. పదవీ విరమణ తరవాత అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించడం మోదీ పాలనలోనూ ఎన్నడూ కనిపించలేదు. ఇప్పుడు రిజిజు ఈ హెచ్చరిక చేస్తున్నారంటే పదవీవిరమణ తరవాత క్రియాశీలంగా ఉండే న్యాయమూర్తులను కూడా మోదీ సర్కారు టుక్డే టుక్డే గ్యాంగ్‌ కింద జమ కడ్తోందన్న మాట. ప్రభుత్వంమీద విమర్శను మోదీ పై విమర్శగా, మోదీ మీద విమర్శను దేశం మీద విమర్శగా పరిగణిస్తున్నతీరు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అంటే ఏ వైపు నుంచి విమర్శ ఎదురైనా మోదీ సర్కారు సహించదన్నమాట.
తమకు అనుకూలమైన తీర్పులిచ్చే న్యాయమూర్తులకు మాత్రం రాజ్యసభ సభ్యత్వం, గవర్నరు పదవి ఇచ్చి మోదీ ప్రభుత్వం సత్కరిస్తోంది. ఈ సంప్రదాయం మోదీ హయాంలోనే వచ్చింది కాకపోవచ్చు కానీ, మునుపటి కన్నా అనుకూల న్యాయమూర్తులకు పదవీ విరమణానంతరం పదవులు కట్టబెట్టడం పెచ్చరిల్లిపోయింది. అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హెచ్చరించే స్థాయికి మోదీ సర్కారు చేరుకుంది. ఈ విమర్శల్లో ఆంతర్యం న్యాయవ్యవస్థను లొంగదీయడమే. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే సహించబోమని సూటిగా చెప్పడమే. ఇది న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తికి ఎసరు పెట్టడమే. అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ప్రసాద్‌ న్యాయశాఖమంత్రులుగా ఉన్నప్పుడుకూడా న్యాయ వ్యవస్థమీద ఇంత బాహాటంగా దాడి జరగలేదు. ఇది వారి వ్యక్తిత్వానికి, సంస్కారానికి సంబంధించిన అంశం మాత్రమేకాదు. ప్రభుత్వాధినేత దన్ను, ప్రోద్బలం లేకపోతే ఏ న్యాయశాఖమంత్రి కిరణ్‌ రిజిజు లాగా నిరంతరం న్యాయవ్యవస్థపై దాడి చేయడానికి సాహసించరు. కాలం గడుస్తున్న కొద్దీ న్యాయవ్యవస్థ విషయంలో మోదీ సర్కారు ప్రతికూలవైఖరి పెరుగుతూనే ఉంది. కాస్త ఎక్కువకాలం ప్రధాన న్యాయమూర్తులుగా ఉండే అవకాశం వచ్చినవారు ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తడం లేదు. ఇది ప్రభుత్వానికి సంకటంగా తయారైంది. సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసంచేస్తున్న మోదీ సర్కారుకు సుప్రీంకోర్టు రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించడం నచ్చడంలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img