Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పోయిన పరువు నిలుపుకునే మోదీ చర్య

వెనుకటి కాలానికి పన్ను వసూలు క్లాజును రద్దు చేస్తూ రెండు రోజులక్రితం లోక్‌సభ ఆమోదించింది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కళ్లు తెరవడం మంచి విషయమే. ముడి చమురు అన్వేషణ సంస్థ కెయిర్న్‌, వోడాఫోన్‌ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌ పరువు పోగొట్టుకున్న తర్వాత పాత క్లాజును రద్దు చేసింది. తప్పని పరిస్థితుల్లోనే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడులు రావడం కష్టమని ప్రభుత్వం ఆందోళన చెందింది. ఓట్లు వేసి గెలిపించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలను ఏమాత్రం ఖాతరు చేయని పాలకులు అంతర్జాతీయ సంస్థల డిమాండ్లను అంగీకరించడం జరుగుతుందా..! వివిధ దేశాల మధ్య కుదిరిన అంతర్జాతీయ ద్వైపాక్షిక ఒప్పందాలను విధిగా అమలు చేయవలసిందే. అయితే కెయిర్న్‌ విషయంలో తమ నిర్ణయం సరైందని ప్రభుత్వం వాదించింది. కెయిర్న్‌ వాణిజ్య సంస్థ కాదని, ద్వైపాక్షిక ఒప్పందం వర్తించదని వాదించినప్పటికీ కోర్టు తీర్పు కెయిర్న్‌కు అనుకూలమైంది. ఒప్పందాలను ఉల్లంఘించి వెనుకటి కాలానికి కూడా పన్నులు చెల్లించాలని భారత ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో కెయిర్న్‌ అందుకు తిరస్కరించింది. అంతేకాదు, భారత్‌లో చమురు అన్వేషణ కార్యకలాపాలు నిర్వహించే కెయిర్న్‌ తమకు చెల్లించవలసిన పన్ను వసూలు కోసం ఆ సంస్థ ఆర్థిక ఆస్తులు కొన్నింటిని విక్రయించింది. పైగా రు.24,247 కోట్లు తమకు చెల్లించాలని ఐటి శాఖ డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో కెయిర్న్‌ అంతర్జాతీయ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. హేగ్‌లో గల ఈ అంతర్జాతీయ కోర్టు కెయిర్న్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఒక దశలో రాజీ పరిష్కారానికి కెయిర్న్‌ ముందుకు వచ్చిందన్న వార్తలొచ్చాయి. 2012`13లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఆదాయం పన్ను చట్టం సవరణ క్లాజు ద్వారా గడచిన సంవత్సరాలకు కూడా పన్నులు వసూలు చేయాలన్న నిర్ణయం చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ విధానం ‘‘పన్నుల టెర్రరిజం’’ అని దుయ్యబట్టింది. ఈ నిర్ణయం జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత అధికారానికి వచ్చిన మోదీ ప్రభుత్వం ఈ క్లాజును రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. దేశ ప్రజలకిచ్చిన అనేక హామీలను నెరవేర్చడంలో విఫలమైనట్టుగా, అంతర్జాతీయ హామీని సైతం పట్టించుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు 60 దేశాలు భారతదేశంలో ఒప్పందాలు రద్దు చేసుకోవడం లేదా ఒప్పందాలను తమకు అనుకూలంగా సవరించుకోవడం జరిగింది. పన్నులు, తదితర విషయంలో 17 సంస్థలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ కలిసి అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారతదేశ పరువు, ప్రతిష్ఠను దెబ్బతీశాయి. అంతర్జాతీయంగా అనేక ప్రతికూలతలు ఎదురైనప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచి పెట్టలేదు. 5 సంవత్సరాలకు పైగా కేసు నడుస్తూనే ఉంది. ప్రతికూల పరిస్థితులపై పునరాలోచన చేయలేదు.
హేగ్‌ కోర్టులో గెలిచిన తర్వాత ఫ్రాన్సు కోర్టులోనూ కెయిర్న్‌ కేసు వేసింది. ఫ్రెంచి కోర్టు, ఫ్రాన్సులో భారతదేశానికి సంబంధించిన రు.24 వేల మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొనే హక్కును కెయిర్న్‌కు ఇచ్చింది. దీంతో బెంబేలెత్తిన మోదీ ప్రభుత్వం వివిధ దేశాలలో గల మన బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉపసంహరించుకోవలసిందిగా ఆదేశించింది. రెండు నెలల క్రితమే అమెరికాలోని ఎయిర్‌ ఇండియా ఆస్తులను తమకు అప్పగించాలని కోరుతూ కెయిర్న్‌ అక్కడి కోర్టులో కేసు వేసింది. కెయిర్న్‌, వోడా ఫోన్‌లు అంతర్జాతీయ కోర్టు ఆశ్రయం పొంది కేసులు గెలుపొందాయి. కెయిర్న్‌కు చెల్లించవలసిన డిపాజిట్లను సైతం 2016లో నిలిపివేసింది. వోడా ఫోన్‌ను 2.1 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఐటి శాఖ డిమాండ్‌ నోటీసు పంపడంతో అది నగదు సంక్షోభంలో పడిపోయింది.
అలాగే ఆంట్రిక్‌ కార్పొరేషన్‌ వర్సెస్‌ దేవస్‌ మల్టీ మీడియా కేసులోనూ భారతదేశ పరువు పోయింది. ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌పై దేవస్‌ 2015లో అంతర్జాతీయ కోర్టులో గెలుపొందింది. ఇది జరిగిన తర్వాత దేవస్‌ తప్పుడు కార్యకలాపాల కోసమే ఏర్పాటు చేసిందని, దాన్ని మూసివేయాలని ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌ కేసు వేసింది. ఇక్కడ ట్రిబ్యునల్‌లో ఆంట్రిక్స్‌కు అనుకూల తీర్పు వచ్చింది. ఇలాంటి విషయాల్లో భారతదేశ ప్రాంతం విశ్వసించదగింది కాదంటూ ప్రచారం జరిగి మన ప్రతిష్ఠకు భంగం కలిగింది. విధానపరమైన నష్టపరిచే నిర్ణయాలను ఉపసంహరించుకోకుండా మోదీ ప్రభుత్వం నిరంకుశ పోకడలు ఇంటా, బయటా అప్రతిష్ఠ పాలవుతుండడం కళ్లకు కడుతూనే ఉంది. ఈ రెండు సంస్థల వ్యవహారంలో అరుణ్‌జైట్లీ కూడా మోదీని హెచ్చరిస్తూ లేఖ రాసినట్టు సమాచారం వెల్లడైంది. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న వలస పాలకులు చేసిన దేశ ద్రోహ నేర చట్టాన్ని ఎడపెడా అమలు చేయడం ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ వైఖరి సరికాదని హెచ్చరించింది. గతంలో ఏనాడు లేని విధంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైనందున పన్ను క్లాజును హడావిడిగా రద్దు చేసి ఉండవచ్చు. లేకపోతే ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మోదీ ప్రభుత్వం తమ విజయంగా ప్రచారం చేసుకోవడం కద్దు. ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ క్లాజు రద్దు చేసినప్పటికీ దేశ విదేశీ పెట్టుబడి వెంటనే మన దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెడతారని ఆశించడం కష్టం. అందునా కరోనా మూడో దశ ప్రారంభమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు వరద ప్రవాహంలాగా వస్తాయని భావించలేము.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img