పార్లమెంటులో అధికార పక్షం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద కక్షగట్టినట్టు ప్రవర్తిస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడుతోంది అని రాహుల్ గాంధీ ఇటీవల ఇంగ్లాండ్ లో పర్యటించినప్పుడు వివిధ వేదికల మీద చేసిన ఆరోపణలు దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నందువల్ల ఆయన ముందు క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు పార్లమెంటులో పట్టుబట్టారు. తన మీద నలుగురు కేంద్ర మంత్రులు పార్లమెంటు వేదిక మీద ఆరోపించారు కనక తాను ఆ వేదిక మీంచే మాట్లాడతానని రాహుల్ గాంధీ సవ్యంగానే వాదిస్తున్నారు. దీనికి అధికార పక్ష సభ్యులు ససేమిరా అంటున్నారు. అధికార పక్ష సభ్యులే పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డు తగలడం మోదీ హయాంలో సృష్టించిన సరికొత్త సంప్రదాయం. అసలు ఇదే ప్రజాస్వామ్యం బలహీన పడుతోందనడానికి నిదర్శనం. అయిదు రోజుల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. అయిదవ రోజైన శుక్రవారం ఉదయమే గందరగోళం సృష్టించి లోకసభ సమావేశాలు వచ్చే వారం దాకా అంటే 20వ తేదీ దాకా వాయిదా వేయడం చూస్తే లోకసభ స్పీకర్ సైతం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గురువారం స్పీకర్ ఓం బిర్లాను కలిసి సభలో తాను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీ సభా వేదిక మీద నోరు విప్పితే ఏం జరుగుతుందో బీజేపీ పక్ష సభ్యులకు తెలుసు. లండన్లో ఆయన అన్న మాటలను సమర్థించుకుంటారని, అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో వివరణ ఇస్తారని అధికార పక్షానికి తెలుసు. కానీ సభా వేదిక మీద నలుగురు మంత్రులు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం లేకుండా పోయింది. రాహుల్ గాంధీ ఇంగ్లాండ్లో పాల్గొన్న సమావేశాల్లో గానీ, కేంబ్రిడ్జ్లో మాట్లాడినప్పుడు గానీ దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడ్తోంది అన్నారు తప్ప విదేశాలు జోక్యం చేసుకోవాలని అన్న దాఖలాలు లేవు. అయినా రాహుల్ మాటలను వక్రీకరించి ఆయన ఇతర దేశాలను జోక్యం చేసుకోవాలని కోరారని అధికార పక్షం అబద్ధాన్ని ప్రచారంలో పెడ్తోంది. తన మీద నలుగురు మంత్రులు పార్లమెంటు వేదిక మీంచే విమర్శలు గుప్పించారు కనక ఆ వేదిక మీంచే వివరణ ఇస్తానని రాహుల్ అనడంలో అనౌచిత్యం ఏమిటో అధికారపక్ష సభ్యులకే తెలియాలి. మరికొన్ని రోజులపాటు ఇలాగే అధికారపక్ష సభ్యులు సభకు అంతరాయంకలిగిస్తూ ఉంటే రెండవ విడత బడ్జెట్ సమా వేశాల తంతు ముగించాలని బీజేపీ భావిస్తోంది. సభా వేదిక మీద రాహుల్గాంధీ తనమీద చేసిన ఆరోపణలను వినే ఓపిక, ఉద్దేశం, ధైర్యం తనది 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే ప్రధాన మంత్రి మోదీకి లేకపోవడంవల్లే ఇలా సభా కార్యకలాపాలకు ఆటంకం కలగజేస్తున్నారు. రాహుల్గాంధీ విదేశాల్లో చెప్పిన మాటలపై ఆయన మీద కేసు పెట్టాలని, ఆయన దేశద్రోహి, ఆయనను దేశంలోనే ఉండనివ్వకూడదని వాదించిన బీజేపీ నాయకులకు ఆయన చెప్పే మాటలు వినే ఆత్మస్థైర్యం లేదని రుజువు అవుతోంది. సభా కార్యకలాపాలు కొనసాగేట్టు చూడవలసిన బాధ్యత ప్రధానంగా అధికార పక్షంపై ఉంటుంది. ఇది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రధాన బాధ్యత. కానీ ఆ శాఖను నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషీ స్వయంగా పార్లమెంటు వేదిక మీంచి రాహుల్ గాంధీని తూర్పార పడుతున్నారంటే అధికారపక్షం ఆంతర్యం ఏమిటో స్పష్టం అవుతోంది.
రాహుల్ గాంధీ లోకసభలో నోరు తెరిస్తే మళ్లీ అదానీకి, మోదీకి మధ్య ఉన్న సంబంధాలపై నిలదీస్తారని అధికారపక్షానికి తెలుసు. అంతే కాదు బడ్జెట్ మొదటి విడత సమావేశాలలో రాహుల్ చేసిన 18 వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించారు. సభా మర్యాదకు భంగం కలిగించే పదాలను రికార్డుల నుంచి తొలగించే సంప్రాదాయం ఉంది. అయితే మోదీ హయాంలో తమకు నచ్చని వ్యాఖ్యలను ఏకంగా తొలగించే దుష్ట సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారమే కాక 105వ అధికరణం ప్రకారం పార్లమెంటు సభ్యులకు ఏ అంశాన్ని అయినా ప్రస్తావించే అవకాశం, హక్కు ఉన్నాయన్న వాస్తవాన్ని అంగీకరించే ధైర్యం అధికార పక్షానికి లేదు. సభా వేదిక మీద సభ్యులు ఏం మాట్లాడినా దానికి రుజువులు చూపాలని అడిగే హక్కు ఎవరికీ లేదు. కానీ రాజ్యసభ అధ్యక్ష స్థానంలో ఉన్న జగదీప్ ధన్కర్ ఎప్పుడూ లేని ఈ సంప్రదాయాన్ని సృష్టించారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్ష స్థానం రాజ్యాంగబద్ధ పదవులనీ, ఆ స్థానాల్లో ఎవరున్నా నిష్పక్ష పాతంగా వ్యవహరించాలన్న సూత్రాన్ని, సంప్రదాయాన్ని అంగీకరించ డానికి ధన్కర్ సిద్ధంగా లేరు. ఆయన పూర్తిగా అధికారపక్షానికి చెందిన వ్యక్తిగా పని చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మంటగలుస్తోందన డానికీ ఇదీ ప్రబలమైన ఉదాహరణే.
రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం వస్తే నాలుగు మౌలిక ప్రశ్నలు లేవనెత్తే వారు. ఒకటి: అదానితో మోదీకి ఉన్న బంధం ఏమిటి? రెండు: ఆస్ట్రేలియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా ఉన్నప్పుడు అదానీకోసం ఏయే ఒప్పందాలకు మోదీ సహకరించారు? మూడు: బంగ్లాదేశ్, శ్రీలంకలో అదానీకి వ్యాపార అవకాశాలు ఎలా వచ్చాయి? నాలుగు: బొంబాయి సహా అనేక విమానాశ్రయాలు అదానీకి ఎలా దక్కాయి? ఈ ప్రశ్నలనే రాహుల్ ఇంతకు ముందూ లోకసభలో ప్రస్తావిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగించారు. ఇప్పుడు ఆయనను మళ్లీ సభలో మాట్లాడనిస్తే ఇవే ప్రశ్నలు లేవనెత్తుతారని మోదీ సర్కారుకు తెలుసు. అందుకే రాహుల్ నోరు విప్పకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. అదానీకి కాంట్రాక్టు ఇవ్వాలని మోదీ ఒత్తిడి చేశారని శ్రీలంక నాయకుడు రాజపక్ష బహిరంగంగానే చెప్పారు. బంగ్లా దేశ్ కు విద్యుత్ సరఫరా చేయడానికి అదానీ కంపెనీకి అవకాశం దక్కడంలో మోదీ ప్రమేయం కూడా రహస్యం ఏమీ కాదు. అందుకే సభ జరగకుండా చేయాలని అధికారపక్షం నిర్ణయించుకుంది. పార్లమెంటులో దృశ్యాలు కనిపిస్తాయి. సభ్యులు స్పీకర్ ఎదుట గుమిగూడుతారు. ఏదో మాట్లాదుతున్న దృశ్యం కనిపిస్తుంది. కానీ వారు మాటలు మాత్రం వినిపించవు. అంతా మూకాభినయమే. నిజంగా మూకాభినయం జరిగిందని కాదు. ప్రతిపక్ష నేతల మైకు ఆపేయడానికి అలవాటు పడ్డ అధికార పక్షం టీవీల్లో పార్లమెంటు కార్యకలాపాలు చూసే వారికి వినిపించకుండా చేసింది. గత అయిదు రోజులుగా కేవలం 75 నిమిషాలపాటే పార్లమెంటరీ కార్యకలాపాలు కొనసాగాయి. కానీ లోకసభలో కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూడగలిగిన వారికి మాత్రం రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్న మాటలు వినిపించాయి. అధికారపక్ష సభ్యులు యాగీ చేయడం వినిపించింది. శుక్రవారం 21 నిమిషాలసేపు ఇదే తంతు.