Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మోదీ సర్కారు చేతులెత్తేసే వైఖరి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో తటస్థ వైఖరి అనుసరించి మోదీ సర్కారు మంచి పనే చేసింది అనుకుంటున్న సమయంలో దౌత్య వ్యవహారాల్లోనూ, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార తీయులను వెనక్కి తీసుకురావడంలోనూ కేంద్ర ప్రభుత్వం కాళ్లీడు స్తోంది. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి మొదలై వారం రోజులు గడిరచింది. ఈ మధ్యలో మూడు సార్లు మోదీ రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. అయితే ఈ సంప్రదింపులు ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులను, ప్రధానంగా విద్యార్థులను వెనక్కు తీసుకురావడంలో మనకు పెద్దగా ఉపకరిం చిందేమీ లేదు. ఇంకా 8,000 మంది ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయి ఉన్నారు. ఈ మాట ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్తు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ చెప్పారు. వీరిని క్రమంగా వెనక్కు తీసుకురావడం సాధ్యం కావచ్చు. రష్యా దాడి మొదలైన తరవాత ఉక్రెయిన్‌ నుంచి 8,36,000 మంది తరలి పోయారు. ఇది పరిస్థితి తీవ్రతకు సంకేతం. ఈ ప్రతికూల పరిస్థితిలో భారతీయులను తరలిం చడం అంత సులభం కాదన్న మాట వాస్తవమే అయినా అగ్రరాజ్యం కావా లనుకుంటున్న భారత్‌ నిస్సహాయత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌కు మన విమానాలను పంపి మన పౌరులను వెనక్కు పిలిపించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ నానాయాతన పడి భారతీయులు ఉక్రెయిన్‌ సరిహద్దులోని పోలండ్‌, హంగరీ, రొమేనియా లాంటి దేశాల సరిహద్దులకు చేరుకుని స్వదేశం వెళ్లే అవకాశం కోసం ఎదురు చూస్తు న్నారు. మన వారిని వెనక్కు తీసుకు రావడానికి భారత్‌ ప్రత్యేక విమా నాలను నడపడమే కాక భారత వైమానిక దళ విమానాలను కూడా విని యోగిస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌ గగనతలంలోకి ప్రవేశించే అవకాశం లేదు కనక పొరుగు దేశాల సరిహద్దుల్లోకి చేరుకున్న వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రష్యా సేనలు ఉక్రెయిన్‌లోని ఖెర్సన్‌ నగరాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. కీలకమైన అజోవ్‌ రేవు ఉన్న మరియుపోల్‌ను కూడా రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మనవారిని ఎలా వెనక్కు తీసుకురావాలన్న కచ్చితమైన ప్రణాళిక మోదీ సర్కారుకు ఉన్నట్టు కని పించడం లేదు. ఉక్రెయిన్‌ పొరుగు దేశాల సరిహద్దుల్లోకి చేరుకోగలిగిన వారిని మాత్రమే తీసుకొస్తున్నారు. చిక్కుకు పోయిన భారతీయులను తీసుకు రావడానికి నలుగురు కేంద్ర మంత్రులను పంపించారు. మంచిదే. కానీ ఈ ఏర్పాట్లు చేయడానికి ఇంత జాప్యం ఎందుకో మోదీ సర్కారుకే తెలియాలి. ఉక్రెయిన్‌ మనకు శత్రుదేశం ఏమీ కాదుగా. ఆ దేశంతో దౌత్యం నెర పడంలో ఎందుకు విఫలమైనట్టు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కానీ మన వారిని తరలించడం మోదీ సర్కారు చేస్తున్న ఘనకార్యంగా చెప్పు కోవడం జుగుప్సాకరం. పొరుగు దేశాలకు చేరుకోవడానికే మన విద్యార్థులు యమ యాతన పడవలసి వస్తోంది. కొంత మంది సరిహద్దులో రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్ని స్తున్న వారికి ఆహారమే కాదు, మంచినీళ్లు సైతం అందుబాటులో లేని దుర్భర స్థితి కొనసాగుతోంది. బంకర్లలో తలదాచుకుందామన్నా డబ్బు చెల్లించాలంటున్నారు. స్వదేశం చేరడం ఆలస్యమవుతున్నా కనీసం సజీవంగా ఉన్నందుకు ఆ అభాగ్యులు సంతోషిస్తున్నారు.
చిక్కుకుపోయిన వారికి భారత ప్రభుత్వం ఇస్తున్న సలహాలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉన్నాయి. ఎలాగోలా ఖర్కీవ్‌లో ఉన్న వారు పెసోచిన్‌, బబయే లేదా బెజ్ల్యుదొవ్కా సరిహద్దులకు సాయంత్రంలోగా చేరు కోవాలని మోదీ ప్రభుత్వం ఉచిత సలహా పడేసింది. ఏ ప్రయాణ సదు పాయమూ లేకపోతే కాలి నడకనైనా సరిహద్దు దాటాలని చెప్తున్నారు. వాహనాలు దొరకని వారు 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న పిసోచిన్‌, 12 కిలోమీటర్ల దూరం ఉన్న బబేయే, 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్ల్యు ద్వికా చేరుకోవాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం సలహాలు గుప్పించడం కేవలం నిస్సహాయతే కాదు పరిస్థితిని ఎదుర్కోలేక చేతులెత్తేయడమే. కరోనా మహమ్మారి కాటేసినప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు వందల కిలోమీటర్లు నడిచి వెళ్లగా లేనిది విద్యార్థులు పది పదిహేను కిలోమీటర్లు నడవలేరా అని ఎకసక్కెం చేస్తున్నట్టుగా ఉంది మోదీ సర్కారు వ్యవహారం. అనేక చోట్ల రోడ్డు రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. రైళ్లెక్కి వద్దామంటే కొన్ని సందర్భాలలో మన వారిని రైళ్లెక్కనివ్వడమే లేదు. ఎలాగో ఎక్కిన వారిని రైళ్లలోంచి దించేసిన ఉదంతాలూ ఉన్నాయి. దిక్కు తోచక రైల్వే ప్లాట్‌ఫాంల మీద ఉండిపోవలసి వస్తోంది. దౌత్యపరంగా కూడా భారత్‌ డొల్లతనం బయటపడిరది. యుద్ధ మేఘాలు ఆవరించినప్పుడే భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి అని గొప్పగా చెప్పుకుంటున్న అమెరికాతో సరైన రీతిలో సంప్రదించాల్సింది. ఉక్రెయిన్‌లో 20,000 మంది భారతీయులు ఉన్నారు కనక రష్యా నాయకులతో అత్యు న్నత స్థాయిలో చర్చించాల్సింది. ఒక వేళ చర్చించినా అమెరికా పెత్తందారీ ధోరణిలో మాట్లాడి ఉండవచ్చు. లేదా భారత్‌కు వాస్తవ పరిస్థితులు చెప్ప కుండా రష్యా పెడదారి పట్టించి ఉండవచ్చు. ఇలాంటి వాటిని కనిపెట్టడం దౌత్యనీతిలో ప్రధానాంశం. ఐక్య రాజసమితి భద్రతా మండలిలో రెండు సార్లు, సాధారణ సభలో ఒకసారి భారత్‌ ఓటు వేయకుండా గైరుహాజరైంది. ఆయితే ఆఫ్రికాలోని 18 దేశాలు అమెరికాకు వంత పాడలేదని గుర్తుంచు కోవాలి. ఆసియాలో భారత్‌తో సహా చైనా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ , శ్రీలంక, ఇరాన్‌, ఇరాక్‌, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, మంగో లియా, లావోస్‌, వియత్నాం కూడా ఓటు వేయకుండా గైరుహాజ రైనాయి. ఐక్యరాజ్య సమితిలో మొట్ట మొదట ఈ యుద్ధం ప్రస్తావన వచ్చినప్పుడే భారత్‌ చొరవ తీసుకుని రష్యా దాడిపై నిర్దిష్ట వైఖరి అనుసరించాల్సింది. తద్వారా ఉక్రెయిన్‌ సార్వ భౌమాధికారానికి, దేశ సమగ్రతకు మద్దతు ఇచ్చినట్టయ్యేది. అంతకన్నా ముఖ్యంగా రష్యా దాడికి వెనక ఉన్న కారణాలను ప్రస్తావించి అమెరికా దొంగ నాటకాలను ఎండగట్టి ఉండాల్సింది.
భద్రతా మండలిలో ప్రతిపాదిం చిన తీర్మానంలో ఈ అంశాలు చేర్చడమే కాకుండా ఆ తీర్మానం ముసా యిదా తయారీలోనే భాగస్వామి అయి భారత్‌ వైఖరిని మరింత బలంగా ప్రదర్శించాల్సింది. భారత్‌ నిష్క్రియాపరత్వం వల్ల అమెరికా విధానాలను ఎండగట్టే అవకాశం, రష్యా చేస్తున్న పొరపాటును ఎత్తి చూపే అవకాశం కోల్పోవలసి వచ్చింది. ఫలితంగా భారత్‌ చేష్టలుడిగినట్టు ఉండిపోవలసి వచ్చింది. యుద్ధం ఎక్కడ జరిగినా అది శాంతికి భంగం కలిగిస్తుందని గట్టిగా వాదించే సంప్రదాయాన్ని మోదీ ప్రభుత్వం చేజేతులా వదులుకుంది. విదేశాంగ విధానంలో సందిగ్ధత, మన విద్యార్థులను వెనక్కు తీసుకు రావడంలో చేతులెత్తేయడం మోదీ సర్కారు దివాలాకోరుతనం. అలీ నోద్యమం అంతరించి పోవడం ఎంత వినాశకరమో ఎవరైనా గుర్తిస్తారా అన్నది అసలు ప్రశ్న.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img