న్యాయం జరుగుతుందన్న ఆశతోనే జనం కోర్టు మెట్లుక్కు తారు. కొన్నిసార్లున్యాయం జరుగుతుంది. మరికొన్ని సార్లు న్యాయం జరగకపోవచ్చు. వివిధ రకాల ఆరోపణల మీద పోలీసులు చాలా మందిని అరెస్టుచేస్తుంటారు. వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిస్తే జైలుకు పంపాలో లేదో మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. లఖింపూర్ ఖేరీలో గత అక్టోబర్ మూడవ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా మంగళవారం జైలునుంచి విడుదలయ్యారు. ఆయన జామీనుకోసం కింది కోర్టులను ఆశ్రయిస్తే బెయిలు మంజూరు కాలేదు. కానీ గత వారం అలహాబాద్ హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. అలాగే మహిళలను తూలనాడారన్న ఆరోపణలతో అరెస్టయిన యతి నర్సింగా నందకు కూడా హరిద్వార్ సెషన్స్కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆ కేసునుబట్టి అరెస్టయిన వారెవరికైనా బెయిలు మంజూరు చేయడం లేదా నిరాకరించడం పరిపాటి. మన న్యాయ సూత్రాలప్రకారం బెయిలుహక్కు. జైలులో ఉంచడం అసాధారణం మాత్రమే. అత్యవసర మనుకుంటే తప్ప బెయిలు నిరాకరించకూడదు. అనేక సందర్భాలలో మేజిస్ట్రేట్లు, న్యాయస్థానాలు బెయిలు మీద విడుదల చేయవచ్చు. అయితే ఆందోళన చేస్తున్న రైతుల మీంచి కారు తోలి నలుగురి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి కుమారుడి ఆశీష్మిశ్రాకు బెయిలు ఇవ్వడం చాలామందికి మింగుడు పడక పోవచ్చు. ఆరోపణలు తీవ్రమైనవి అయినప్పుడు ఇలాంటి అభిప్రాయాలు ఉండడం సహజమే కానీ అది న్యాయం కాదు. అందువల్ల అశీశ్ మిశ్రా బెయిలు మీద విడుదల కావడం, యతి నర్సింగానందకు హరిద్వార్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భరత్ భూషణ్ పాండే బెయిలు మజూరు చేయడంలో ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు. హరిద్వార్ ధర్మ సన్సద్లో ముస్లింలను మూకుమ్మడిగా హతమార్చాలని పిలుపు ఇచ్చిన కేసులో కూడా నర్సింగా నందా నిందితుడే. ఆ కేసులో ఆయనకు ఫిబ్రవరి ఏడున బెయిలు మంజూరు అయింది. నర్సింగానంద కూడా రేపోమాపో విడుదల కావచ్చు. ఆశీష్ మిశ్రాకు బెయిలు మంజూరుచేయడంపై వివాదాలు చెలరేగు తున్నాయి. అదీ సహజమే. ఎందుకంటే ఆయన మీద ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి. ఆయన కేంద్ర మంత్రి కుమారుడు కావడంవల్ల ఆయనను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ఆయన మీద విచారణ జరగాల్సి ఉంది. ఈ లోగా బెయిలు ఇవ్వడం ఏ రకంగానూ చట్ట వ్యతిరేకం కాదు. ఆశీష్ మిశ్రాకు బెయిలు మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలుచేస్తామని రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేశ్ తికైత్ ప్రకటించారు. అయితే ఆశీష్మిశ్రాకు బెయిలు మంజూరుచేసిన న్యాయ మూర్తిపై విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చారని రైతులు అంటున్నారు. ఆశీష్ మిశ్రాకు బెయిలు మంజూరు చేసే ముందు న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయి. ఆశీష్ కాల్పులు జరిపారన్న పోలీసుల వాదనను న్యాయస్థానం ప్రశ్నించింది. ఆయన కాల్పులు జరిపినందువల్ల ఎవరికీ తుపాకీ గుళ్లు తగిలిన దాఖలాలు లేవు కదా అని ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. పైగా ఆశీష్ మిశ్రా దర్యాప్తులో సహకరిస్తున్నారు కదా అని న్యాయస్థానం వ్యాఖ్యానించడంలో నిజం లేదు. ఎందుకంటే ఆయనను అరెస్టు చేయడానికే పోలీసులు తాత్సారం చేశారు. పోలీసులు రమ్మన్నప్పుడు ఆయనరాలేదు. తీరికగా తనకు అనువైనప్పుడే వచ్చారు. మొదటిరోజు ఆయనను అరెస్టుచేయడానికి పోలీసులువెళ్తే ఆయన ఇంట్లోనే ఉన్నా ఆరోగ్యం బాగాలేదని చెప్తే పోలీసులు ఆయన ఇంటి మీద నోటీసు అతికించి అరెస్టుచేయకుండా తిరిగొచ్చి ఔదార్యం చూపించారు. రాజకీయ ఒత్తిడి ఉందనడానికి ఇదే నిదర్శనం. సుప్రీంకోర్టు కలగజేసు కుంటే తప్ప పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి సాహసించలేదు. పైగా ఆశీష్మిశ్రా జైలునుంచి వెనకద్వారం ద్వారా బయటకు వెళ్లిపోయారు. ఇది కచ్చితంగా అసాధారణమే కాక ఆయనకు కల్పించిన వెసులుబాటే.
బీమా కోరే గావ్ కేసులో అనేకమందిని అరెస్టు చేశారు. వారు ఎన్ని సార్లు బెయిలుకోసం అభ్యర్థించినా బెయిలు దొరకడం లేదు. ఆ కేసులోనే నిందుతులైన ప్రసిద్ధ కవి వరవర రావు, న్యాయవాది సుధా భరద్వాజ్ మాత్రం బెయిలు మీద విడుదలయ్యారు. మరో హక్కుల కార్యకర్త స్టాన్ స్వామిని 2020 అక్టోబర్ ఎనిమిదిన బీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేశారు. ఆయన పార్కిన్సన్ వ్యాధితో బాధ పడుతుండేవారు. కనీసం గ్లాసు పట్టుకుని మంచి నీళ్లయినా తాగడం సాధ్యం అయ్యేది కాదు. బీమా కోరే గావ్ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిలు ఇవ్వడానికి అనేక సార్లు తిరస్కరించింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణ కూడా ఉండేది. కానీ ఆయన జీవితకాలం అంతా గిరిజనుల హక్కులకోసమే పోరాడారు. చివరకు ఆయన 2021 జులై అయిదున నిర్బంధంలో ఉండగానే మరణిం చారు. న్యాయస్థానాలలో అన్యాయం కూడా జరుగుతుందనడానికి ఇది బలమైన ఉదాహరణ. 2018నాటి బీమా కోరేగావ్ కేసులో నలుగురు బెయిలు కోసం పెట్టుకున్న అర్జీని మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్.ఐ.ఎ.కు బదిలీ చేయడం లోనే ఆంతర్యం గ్రహించవచ్చు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) కింద కేసులు మోపినప్పుడు బెయిలు ఇవ్వడం మీద నిషేధం లేదు కానీ న్యాయస్థానాలు బెయిలు నిరాకరించడానికే ప్రయత్నిస్తున్నాయి.
కబీర్ కళామంచ్కు చెందిన జ్యోతి జగ్తాప్, సాగర్ గోర్ఖే, రమేశ్ గైచోర్, దిల్లీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబుకు మహారాష్ట్ర ప్రత్యేకకోర్టు సోమవారం బెయిలు నిరా కరించింది. న్యాయస్థానాలుకూడా చట్టంసవ్యంగా అమలయ్యేట్టు చూడడానికి బదులు రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటున్నాయి అని రుజువు అవుతోంది. కబీర్ కళా మంచ్ మీద నిషేధం ఉందంటున్నారు. నిషేధితసంస్థకు సంబంధించిన వారందరినీ జైళ్లల్లో మగ్గిపోయేట్టు చేయాలన్న చట్టం ఎక్కడుందో తెలియదు. ఈ నలుగురి మీద దేశద్రోహం, యు.ఎ.పి.ఎ. కింద కేసు నమోదుచేశారు. పోలీసులుమోపిన ఈ ఆరోపణల నిగ్గు తేల్చ వలసిన బాధ్యత ఉన్న న్యాయస్థానాలు కూడా ఏలిన వారి మనసెరిగి నిర్ణయాలు తీసుకోవడం విచిత్రమే. అందుకే అన్ని సందర్భాలలో న్యాయ స్థానాల్లో న్యాయంజరగకపోవచ్చు అనుకోవలసివస్తోంది. ఆరోపణలకు గురైన వారు దర్యాప్తుకు సహకరించకపోతే లేదా వారిని వదిలితే మరింత ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే తప్ప బెయిలు నిరా కరించకూడదు. కానీ బీమా కోరేగావ్ కేసులో న్యాయస్థానాలు విభిన్నంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిందితులు దర్యాప్తుకు సహకరించడం లేదన్న పోలీసుల వాదన నిరాధారమైంది. ఎన్.ఐ.ఎ. ఇంకా దర్యాప్తు కొనసాగించవలసి ఉంది అంటోంది కనక బెయిలు నిరాకరించడం మౌలిక న్యాయసూత్రానికే విరుద్ధం.