Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

లక్ష్మణ రేఖ బేఖాతరు

న్యాయమూర్తులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు చెప్పే తీర్పులకన్నా విచారణా క్రమంలో చేసే వ్యాఖ్యలు వాడిగా ఉంటున్నాయి. సహజంగానే వాటికున్న ప్రచార సౌలభ్యంవల్ల మీడియా వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. న్యాయమూర్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలతో ఓ సమస్య ఉంది. ఈ వ్యాఖ్యలేవీ తీర్పుల్లో భాగం కాదు. తీర్పుల దగ్గరకు వచ్చేసరికి అవి అనేక సందర్భాలలో నిరాశాజనకంగానే ఉంటున్నాయి. న్యాయ మూర్తులు విచారించవలసింది, తీర్పులు చెప్పవలసింది తమ పరిశీలనకు వచ్చిన అంశాల మీదే. ఇతరేతర అంశాల గురించి వ్యాఖ్యానిస్తే వినసొంపుగానే ఉంటాయి. కాని ధర్మ నిర్ణయానికి ఉపకరించేవి కావు. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు నూపుర్‌ శర్మ మహమ్మద్‌ ప్రవక్త మీద చేసిన విమర్శలు వివాదాస్పదమైనాయి. గల్ఫ్‌ దేశాలలో నూపుర్‌ శర్మ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. మూడు దేశాలైతే అక్కడి భారత రాయబారులను పిలిపించి నిరసన వ్యక్తం చేశాయి. ఆ వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకున్నారు కూడా. బీజేపీ ఆమెను అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పించింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ కూడా చేసింది. నూపుర్‌ శర్మ వ్యాఖ్యల పర్యవసానంగా ఆమె మీద దేశంలోని అనేక హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలైనాయి. ఆరోపణ ఒకటే అయినప్పుడు వేర్వేరు హైకోర్టులు విచారించినందువల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. ఒక వేళ ఆమె మీద ఆరోపణలు రుజువైనా ఒకే సారి శిక్ష పడ్తుంది. ఆమెను హత్య చేస్తామన్న బెదిరింపులు కూడా వచ్చాయి. అందుకని ఆమె సుప్రీంకోర్టు మెట్లెక్కి ఈ కేసులన్నింటినీ దిల్లీ కోర్టుకు బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు సూర్య కాంత్‌, పార్దీవాలా ఆమె అర్జీని తిరస్కరించడమే కాకుండా జులై ఒకటవ తేదీన ఆమె ‘‘నోటికి హద్దు లేదు’’ అని, ఆమె వ్యాఖ్యలవల్ల దేశమంతా అగ్గి అంటుకుంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఆమె ప్రచారంలో ఉండడానికి లేదా రాజకీయ ఎజెండాలో భాగంగా, లేదా దుర్మార్గమైన కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ఇలా మాట్లాడారు’’ అని ఇద్దరు న్యాయ మూర్తులు విరుచుకు పడ్డారు. ఈ మాటల్లో నిజానిజాల మాట ఎలా ఉన్నా వ్యాఖ్యానించింది న్యాయమూర్తులు కనక వీటికి ప్రచారార్హత ఉంటుంది. కానీ ఈ వ్యాఖ్యలకు సందర్భ శుద్ధి ఉందా అని ఆలోచిస్తే లేదనే సమాధానం వస్తుంది. కోర్టుకు వెలుపల జరుగుతున్న పరిణామాలతో ప్రభావితం అయి న్యాయమూర్తులు మాట్లాడడం లేదా తీర్పులు చెప్పడం భావ్యం కాదు. ఈ వ్యాఖ్యలేవీ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులో భాగం కాదు. నూపుర్‌ శర్మ మీద మాత్రమే విరుచుకు పడడం ద్వారా దేశంలో కొనసాగుతున్న విద్వేష ప్రచారాన్ని సుప్రీంకోర్టు పట్టించుకోకుండా వదిలేస్తోందనిపిస్తోంది. ఈ ఇద్దరు న్యాయమూర్తుల మీద ఆ తరవాత సామాజిక మాధ్యమాలలో పెద్ద దుమారమే చెలరేగింది. మరో సమావేశంలో మాట్లాడుతూ న్యాయమూర్తి పార్దీవాలా న్యాయమూర్తుల మీద వ్యక్తిగత దాడి చేయడాన్ని తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాలలో ఇలా దాడి చేయడం పరిపాటి అయి పోయింది. దీన్ని కట్టడి చేసే అవకాశమే లేదు. విచారణ సందర్భంగా న్యాయమూర్తుల ప్రాస్తావిత అంశాలు (ఆబిటర్‌ డిక్టా) న్యాయ ప్రక్రియలో భాగమే. కానీ ఆ వ్యాఖ్యలకు సమయం సందర్భం, ఔచిత్యం ఉండాలి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు చాలా విలువ ఉంటుంది. వాటిలో ఉచితానుచితాలు బేరీజు వేయడానికి న్యాయ కోవిదులు కూడా జడుస్తారు. అసలు కోర్టు ముందున్న వివాదానికి అతీతంగా తీర్పు చెప్పిన ఉదంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయోధ్య వివాదంలో వెలువడిన అంతిమ తీర్పే దీనికి నిదర్శనం. కానీ 15 మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది మాజీ ప్రభుత్వ ఉన్నతా ధికారులు, 25 మంది మాజీ సైనికాధికారులు న్యాయమూర్తులు సూర్య కాంత్‌, పార్దీవాలా కలిసి నూపుర్‌ శర్మపై చేసిన వ్యాఖ్యలలో అనౌచిత్యాన్ని ఎత్తి చూపారు. ‘‘దేశంలో జరుగుతున్న అల్లకల్లోలానికి నూపుర్‌ శర్మ వ్యాఖ్యలే ఏకైక కారణం అని ఇద్దరు న్యాయమూర్తులు అనడం ఉదయ్‌పూర్‌లో కన్హయ లాల్‌ను నరికి చంపడాన్ని గాలికి వదిలేసినట్టే’’ అని ఈ మాజీలు రాసిన బహిరంగ లేఖలో తూర్పారబట్టారు. కన్హయా లాల్‌ సామాజిక మాధ్యమాలలో నూపుర్‌ శర్మను సమర్థించినందుకు ఆయనను హతమార్చారు. నూపుర్‌ శర్మ మీద ఇద్దరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు దేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఎక్కడా లేవని ఈ లేఖలో పేర్కొన్నారు. నూపుర్‌ కేసును ఈ ఇద్దరు న్యాయమూర్తులు భిన్నంగా ఎందుకు పరిగణించారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి మాటలవల్ల సుప్రీంకోర్టుకు ఉన్న గౌరవ మర్యాదలు, పవిత్రత దెబ్బ తింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ మీద సంతకాలు చేసిన 117 మందిలో బొంబాయి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్‌ వ్యాస్‌, గుజరాత్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎం.సోని, రాజస్థాన్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆర్‌.ఎస్‌. రాథోడ్‌, ప్రశాంత్‌ అగర్వాల్‌, దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌.ఎన్‌. దింఘ్రా లాంటి ఉద్దండులున్నారు. మాజీ ఐ.ఎ.ఎస్‌. అధికారులు ఆర్‌.ఎస్‌. గోపాలన్‌, ఎస్‌. కృష్ణ కుమార్‌, మాజీ పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌.పి. వైద్‌, పి.సి. డోగ్రా, మాజీ సైనికాధికారులు లెఫ్టినెంట్‌ జనరల్‌ వి.కె. చతుర్వేది, ఉద్యోగ విరమణ చేసిన ఏర్‌ మార్షల్‌ ఎస్‌.పి.సింగ్‌ వంటి వారు కూడా ఈ లేఖ మీద సంతకాలు చేశారు. న్యాయ మూర్తులు ఇలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమే కాక న్యాయవ్యవస్థకు చెరగని ముద్ర అని కూడా వీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలవల్ల ప్రజాస్వామ్యానికి, దేశ భద్రతకు ముప్పు కలుగుతుందని అన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి మూల కందమైన విభిన్న వ్యవస్థలు దేనికదే తమ విధి సక్రమంగా నిర్వర్తించినప్పుడే వ్యవస్థ పదిలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లక్ష్మణ రేఖ దాటడమే అన్నారు. ఇద్దరు న్యాయమూర్తుల వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ మౌలిక లక్షణాలకు, నిష్పక్షపాత వైఖరికి విఘాతం కలిగిస్తాయని హెచ్చరించారు. అర్జీ పెట్టుకున్న వారి మీద ఎలాంటి విచారణ లేకుండా దారుణమైన వ్యాఖ్యలు చేయడం హద్దు దాటడమే. న్యాయం కోరుతూ కోర్టు మెట్లెక్కిన వారి మీద విరుచుకుపడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాద హెచ్చరికే అవుతుంది. రిపబ్లిక్‌ టీవీ అధినేత, ప్రసిద్ధ పత్రికా రచయిత అర్నాబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టు ఆఘమేఘాల మీద బెయిలు మంజూరు చేసినప్పుడు నూపుర్‌ శర్మ విషయంలో భిన్న ప్రమాణాలు అనుసరించడం విడ్డూరంగా ఉందని ఈ లేఖ రాసిన వారు ఎత్తిపొడిచారు. నిజానికి నూపుర్‌ శర్మ తన మీద దాఖలైన కేసులన్నింటినీ ఒకే కోర్టుకు బదిలీ చేయాలని అభ్యర్థించడం ఏ రకంగానూ అన్యాయమూ కాదు. అక్రమమూ కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img