Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వినకు వినిపించు

ఏ విషయాన్ని అయినా అట్టహాసంగా మార్చేయగల సత్తా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపారంగా ఉంది. 2014 అక్టోబర్‌ మూడవ తేదీన ఆయన రేడియోలో ‘‘మన్‌ కీ బాత్‌’’ పేర నెలకు ఒకసారి ప్రసంగాలు చేయడం మొదలు పెట్టారు. ఆదివారం వందవ ‘‘మన్‌ కీ బాత్‌’’ ప్రసారం అవుతుంది. దీనికి కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఎక్కడలేని హడావుడి చేస్తోంది. కమ్యూనిటీ రేడియో కేంద్రాలన్నీ ఈ వందవ ‘‘మన్‌ కీ బాత్‌’’ కార్యక్రమాన్ని విధిగా ప్రసారం చేయాలని ఆదేశించారు. ప్రసారం చేసినట్టు రుజువులు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించా లట. జనం వింటున్న ఫొటోలు కూడా పంపాలట. వందవ ‘‘మన్‌ కీ బాత్‌’’ ప్రసారం అవుతున్న సందర్భంగా వంద రూపాయల నాణెం ముద్రిస్తున్నారు. దాన్ని ప్రధానమంత్రే విడుదల చేస్తారు. వందవ ప్రసంగానికి ప్రచారం కోసం దిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ఇటీవల ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ తాను ఇప్పటి దాకా ఒక్కసారైనా ‘‘మన్‌ కీ బాత్‌’’ వినకుండా ఉండలేదన్నారు. ఈ ప్రసంగాన్ని మోదీ రేడియో ద్వారానే కొనసాగించడానికి ఓ కారణం ఉంది. టీవీ ప్రసారాలకన్నా రేడియో ప్రసంగాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. దీని అర్థం రేడియో ప్రసంగాలు అందుబాటులో ఉన్న చోటల్లా రేడియో ప్రసారాలు వింటారని కాదు. అసలు జనం రేడియోలు వినడమే తగ్గిపోయింది. మార్కెట్లో రేడియోల అమ్మకాలు బాగా మందగించాయి. రేడియో కొనాలనుకునే వారు కాళ్లు అరిగేట్టు తిరగాల్సిందే. చాలా మంది టీవీల మీదే ఆధార పడ్తున్నారు. ‘‘మన్‌ కీ బాత్‌’’ దూరదర్శన్‌లో ప్రసారం అవుతుంది. కానీ ఇది వినిపిస్తుంది. కనిపించదు. ఎందుకంటే మోదీ ప్రసంగం ప్రధానంగా రేడియో కోసం రూపొందించింది కనక దృశ్యం ఉండదు. 2015 జనవరి 27న ‘‘మన్‌ కీ బాత్‌’’ నాల్గవ ప్రసారానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు అతిథి. 2019 సెప్టెంబర్‌ 29న ప్రసారానికి లతా మంగేష్కర్‌ ముఖ్య అతిథి. అంటే మోదీ తన ప్రసంగాలను ప్రచారంలో పెట్టడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అర్థం అవు తోంది. ‘‘మన్‌ కీ బాత్‌’’ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి రోహ్తక్‌ లోని ఐ.ఐ.ఎం.తో సర్వే కూడా చేయించారు. ఈ సర్వేలో 100 కోట్ల మంది ఈ ప్రసారాన్ని విన్నట్టు తేలిందంటున్నారు. అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ఈ కార్యక్రమం నెలకు ఒకసారి ప్రసారం అవుతుంది. మోదీ వక్తృత్వ పటిమ నిజంగానే గొప్పది. చాలా సందర్భాలలో ఆయన మైక్‌ను కూడా లెక్క చేయకుండా గొంతు చించుకుని మాట్లాడు తుంటారు. కానీ ‘‘మన్‌ కీ బాత్‌’’ ప్రసంగాలు మాత్రం చాలా మంద్ర స్థాయిలో ఉంటాయి. చెవిలో ఏదో గుసగుస చెప్పినట్టు ఉంటుంది. ప్రసంగాలలో సారం కన్నా ప్రసంగించే తీరుకే మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ కార్యక్రమంలో ఏయే అంశాలు ప్రస్తావించాలో సలహాలు కూడా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అంటోంది. రోహ్తక్‌ ఐ.ఐ.ఎం. సర్వే ప్రకారం 23 కోట్ల మంది విడవకుండా ఈ ప్రసంగాలు వింటారట. 40 కోట్ల మంది అప్పుడప్పుడూ వింటారట. ఇంత మంది ఈ ప్రసంగాల మీద అంత ఆసక్తి చూపుతుంటే ప్రభుత్వ ఆదేశాలు, నిర్దేశాలు ఎందుకో! ఆకాశవాణి, దూరదర్శన్‌, మై గవ్‌, పి.ఐ.బి. యూట్యూబ్‌ చానల్‌ మొదలైనవి ‘‘మన్‌ కీ బాత్‌’’ ప్రసారం చేస్తూ ఉంటాయి. 52 దేశ భాషల్లో, 11 విదేశీ భాషల్లో కూడా ‘‘మన్‌ కీ బాత్‌’’ ప్రసారం అవుతుంది. ప్రసారాలు విన్నవారిలో 60 శాతం మంది దేశ నిర్మాణం ఎలాసాగాలో సలహాలు కూడా చెప్పారట. ఈ కార్యక్రమం విన్న వారిలో 63 శాతం మందికి ప్రభుత్వం మీద సానుకూల అభిప్రాయం కల్గిందట. దేశాభివృద్ధి సాగుతున్న తీరు 73 శాతం మందికి ఆశావహంగా ఉందట.
రోహ్తక్‌ ఐ.ఐ.ఎం. సర్వే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ‘‘మన్‌ కీ బాత్‌’’ గురించి తెలియని వారి సంఖ్యే ఎక్కువ. ప్రధానమంత్రి చానల్‌, బీజేపీ యూట్యూబ్‌ చానల్‌ను చూసినా ‘‘మన్‌ కీ బాత్‌’’ మీద ఆదరణ ఎంత తక్కువగా ఉందో అర్థం అవుతుంది. ఈ కార్యక్రమానికి వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమూ తగ్గుతోంది. సి.ఎస్‌.డి.ఎస్‌. సంస్థ జరిపిన సర్వేలో కూడా ‘‘మన్‌ కీ బాత్‌’’ గురించి ప్రస్తావనఉంది. ఈ సంస్థకు ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్తలు సంజయ్‌ కుమార్‌, సుహాస్‌ పల్సీకర్‌, సందీప్‌ శాస్త్రివంటి వారు సలహాదారులుగా ఉన్నారు. ఈ సర్వే ఫలితాలు గత నవంబర్‌లో విడుదలయ్యాయి. అయిదింట మూడొంతుల మంది ‘‘మన్‌ కీ బాత్‌’’ ప్రసంగం ఎన్నడూ వినలేదని ఈ సర్వేలో తేలింది. దక్షిణాది వారిలో ఈ కార్యక్రమంపై పెద్ద ఆసక్తిలేదు. హిందీ రాష్ట్రాలలో పరిస్థితి సైతం మరీ ఆనందపడవలసినంత ఏమీలేదు. టీవీ, ఇంటర్నెట్‌, స్టీరియో లాంటి సదుపాయాలు ఉన్న ఇళ్లల్లోనూ ఈ కార్యక్రమాన్ని విన్న ప్రతి పదిమందిలో ముగ్గురు మాత్రమే ఒకసారో, రెండు సార్లో ఈ కార్యక్రమం విన్నారు. మోదీ మీద అభిమానం ఉన్న వారిలో సగంమంది ఈ ప్రసంగం వినడం లేదట. సి.ఎస్‌.డి.ఎస్‌. సర్వే ప్రకారం హిందీ మాట్లాడని రాష్ట్రాలలో 62 శాతం మందికి ఈ కార్యక్రమం గురించి తెలియదు. హిందీ మాట్లాడే రాష్ట్రాలలో సగం మంది, ఉత్తరాది రాష్ట్రాలలో సగం మంది ఈ కార్యక్రమాన్ని ఆదరించడం లేదు. ఈ ప్రాంతాలు బీజేపీకి పట్టున్నవి అయినా ఉన్న పరిస్థితి ఇదే. బీజేపీకి పలుకుబడి ఉన్న చోట్ల కూడా 51 శాతం మంది దీన్ని పట్టించుకోవడం లేదు. 26 శాతం మంది ఒకసారి విన్నారు. ఇతర పార్టీల అభిమానుల్లో 68 శాతం మంది వినడం లేదు. అంతెందుకు ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌ లోనైనా ఈ ‘‘మన్‌ కీ బాత్‌’’ కార్యక్రమాన్ని పడిపడి వింటున్న దాఖలాలు లేవు. రేడియో వినే అలవాటు బాగా తగ్గిపోయినప్పుడు పరిస్థితి అద్భుతంగా ఉండడం సాధ్యం కాదు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రధాని మోదీ ఒక్కసారి కూడా పత్రికల వారితో సమావేశం ఏర్పాటు చేయలేదు. ‘‘ప్రజాస్వామ్యానికి మన దేశం తల్లి లాంటిది’’ అని ఊదరగొట్టే మోదీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకుండా ‘‘మన్‌ కీ బాత్‌’’ కోసం ఇంత ఆర్భాటం చేస్తున్నారంటే వినిపించడమే తప్ప వినే అలవాటు ఆయనకు లేదనేగా! వాస్తవాలతో మోదీకి ఎన్నడూ సంబంధం లేదు. తన ప్రచారం మీద, తన పలుకుబడి పెంచుకోవడం మీద ఆయనకు అపారమైన ఆసక్తి. అందుకే ‘‘మన్‌ కీ బాత్‌’’ వందవ ప్రసారానికి ఇంత హంగూ ఆర్భాటం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img